డయేరియా మరణాలపై రాజకీయమా? | Two Died With Diarrhea In GGH | Sakshi
Sakshi News home page

డయేరియా మరణాలపై రాజకీయమా?

Mar 17 2018 12:30 PM | Updated on Mar 17 2018 12:30 PM

Two Died With Diarrhea In GGH - Sakshi

మృతదేహంతో జీజీహెచ్‌ వద్ద ధర్నా చేస్తూ ఆర్డీఓతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి

ఆమె ఏడు నెలల గర్భిణి.. కడపులో బిడ్డ కాళ్లతో తన్నుతున్నాడంటూ భర్తకు చెప్పి మురిసిపోయేది.. ఇప్పటికే బాబు ఉన్నందున పాప పుట్టాలని ఆ దంపతులు ఇద్దరూ కలలుకనేవారు. ఆ కలలను డయేరియా మహమ్మారి కల్లలు చేస్తూ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఆ గర్భిణికి తీరని కష్టాన్ని మిగిల్చింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు అమ్మా.. నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడంటూ వచ్చీ్చరాని మాట లతో పదే పదే ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుండెలుఅవిసేలా రోదిస్తోంది.

గుంటూరు ఈస్ట్‌:  నగరంలోని ఆర్‌అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పల్లపు రత్తయ్య (38) తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రత్తయ్య గురువారం వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. రత్తయ్య భార్య లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆ దంపతులకు మూడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. రత్తయ్యకు సరైన వైద్యం చేయని కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.

డయేరియాకు గురడవానికి ముందు వరకు రత్తయ్య ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పండ్లు విక్రయించి వచ్చే రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్నిపోషించే రత్తయ్య మృతితో భార్య లక్ష్మి భవిష్యత్తు అంధకారంలో పడింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని కుమారుడు అమాయకంగా నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడు అంటూ అడగడంతో ఏ సమాధానం చెప్పాలో లక్ష్మి పొగిలిపొగిలి ఏడుస్తోంది. లక్ష్మి విలపిస్తున్న తీరుతో కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. రత్తయ్య మృతితో తమకు దిక్కెవరంటూ అతని తల్లి తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది. ఆనందపేట 8వ లైన్‌కు చెందిన పఠాన్‌ ఫాతిమూన్‌ (67) డయేరియాతో గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement