Sakshi News home page

సామాన్యుల చెంతకు తుడా సేవలు

Published Sun, Aug 4 2019 9:55 AM

TUDA Chairman Chevireddy Bhaskar Reddy At TUDA Office Discussing Tirupati Development And Welfare Schemes - Sakshi

సాక్షి, తిరుపతి తుడా: తుడా సేవలను సామాన్యుల చెంతకు తీసుకెళతామని ఆ సంస్థ చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. తుడా వీసీ పీఎస్‌ గిరీషాతో కలిసి ఆయన శనివారం తుడా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కనీస వసతుల కల్ప నకు పెద్ద పీట వేయనున్నామన్నారు. తుడా పరి ధిలోని అనేక గ్రామాల్లో ప్రజలు కనీస వసతులకు నోచుకోవడంలేదన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తరహాలో మరో నాలుగు నిర్మిస్తామన్నారు. మహిళా వర్సిటీ సమీపంలో తుమ్మలగుంట రోడ్డులోని తుడా విశ్రాంత భవనం పక్కన ఉన్న 1.70 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తిరుచానూరు మార్కెట్‌ యార్డు, మంగళం సమీపంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

కరకంబాడి భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడతామన్నారు. తుడా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మరింత న్యాయం చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్నారు. సూరప్పకశంలోని 146 ఎకరాల తుడా భూముల్లో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వారం పది రోజుల్లో తుడా గ్రీన్‌ టౌన్‌ షిప్‌ ప్లాన్‌ అందుబాటులోకి రానుందన్నారు. తుడా పరిధిలోని ప్రతి ఇం టికీ రెండు పండ్ల మొక్కలు, మరో రెండు వేప, కానుగ వంటి మొక్కలు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని పుస్తకాలను తుడానే అందించి గ్రామీణ విద్యార్థుల ఉన్నతికి దోహదపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ గిరీషా, టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్, తుడా సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంతర్గతంగా సమావేశం
తుడా కార్యాలయంలో చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వీసీ గిరీషా, తిరుపతి అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ సమావేశమయ్యారు. తిరుపతి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.

మా బంధం విడదీయరానిది
మాది అన్నదమ్ముల అనుబంధం.. కష్టనష్టాల్లోనూ మా బంధం విడదీయరానిదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడారు. తుడా కార్యాలయానికి ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి విచ్చేసిన సందర్భంగా శనివారం చైర్మన్‌ చెవిరెడ్డి, వీసీ గిరీషా, ఇతర శాఖల అధికారులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో చైర్మన్‌తో కలిసి కొంతసేపు మాట్లాడారు. తుడాకు విలువ తీసుకురావడంతోపాటు ఉన్నత స్థితిలో నిలిపేందుకు చెవిరెడ్డి కృషి చేస్తారనడంలో ఏ మాత్రమూ సందేహం లేదన్నారు. వీసీగా పీఎస్‌ గిరీషా మంచి సేవలందిస్తారని చెప్పారు. అంతకు ముందు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులని, ఆ తరువాత తామిద్దరం అంతకు మించి స్నేహితులుగా..అన్నదమ్ముల్లా ఉన్నామని అన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement