ప్రయాణికుల పాట్లు

Trains And Bus Services Full in Sankranthi Festival - Sakshi

రైళ్లన్నీ రద్దీ

కిటకిటలాడిన రైల్వే, బస్‌స్టేషన్లు

సంక్రాంతి పండక్కి సొంతూరు వెళ్లేందుకు ప్రయాణికులు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఏ రైలు చూసినా  రద్దీగా వస్తుండడంతో వాటిలో ఎక్కేందుకు ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. ఓవైపు పిల్లాపాపలు, మరోవైపు లగేజీలతో కిక్కిరిసి ప్రయాణించారు. పోనీ బస్సుల్లో వెళదామన్నా ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తరం): సంక్రాంతికి నగరం సొంతూరికి బయలుదేరింది. దీంతో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో నిం డిపోయింది. ఇటు ఇచ్చాపురం, అటు విజయవాడ, హైదరాబాద్‌ వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే నడిచాయి. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు దూర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపారు. ఇదిలావుండగా విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగో దావరి జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ శనివారం ఉదయం నుంచి కిటకిటలాడింది. బస్టాండ్‌ ప్రాంగణం రద్దీగా మారింది. బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.  

సింహాచలం రైల్వేస్టేషన్‌ రద్దీ...
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): వలస జనం స్వగ్రామాలకు ప్రయాణాలు ఒక వైపు...సంక్రాంతి సందర్భంగా సింహాద్రప్పన్న దర్శన భాగ్యం కోసం వచ్చే యాత్రికులతో సింహాచలం రైల్వేస్టేషన్‌ రద్దీగా మారింది. రైళ్లు రద్దీగా ఉండడంతో జనం సాహసాలు చేశారు. ప్రాణాలకు తెగించి మరీ రైలు బోగీలను వేలాడుతూ ప్రయాణించారు. విశాఖ నుంచి రాయపూర్‌ , కోరాపుట్, పలాస, విజయనగరం, కోర్భా, దుర్గు, భువనేశ్వర్, సికింద్రాబాద్‌ తదితర ఎక్స్‌ప్రెస్, ప్యాసింజరు రైళ్లు విశాఖ స్టేషన్‌లోనే కిక్కిరిసి రావడంతో ఇక్కడి స్టేషన్‌లో ఎక్కడానికి యాత్రికులు, ప్రయాణికుల అవస్థలు పడ్డారు. ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవుల సందర్భంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, జనం విహార యాత్రలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top