పేదింట పప్పన్నం లేనట్టే | Toor placed in ration supply depot | Sakshi
Sakshi News home page

పేదింట పప్పన్నం లేనట్టే

Sep 10 2015 11:49 PM | Updated on Sep 3 2017 9:08 AM

పేదింట పప్పన్నం లేనట్టే

పేదింట పప్పన్నం లేనట్టే

విశాఖపట్నం అసలే పండుగ రోజులు. చుక్కలనంటిన ధరలతో పిండివంటలకు ఎలాగూ దిక్కులేదు.

రేషన్‌డిపోలలో నిలిచిన కందిపప్పు సరఫరా
మంత్రి ఆదేశించినాపట్టని అధికారులు
టెండర్లు ఖరారుకాలేదంటూ కుంటిసాకు
బహిరంగ మార్కెట్‌లో కొండెక్కిన ధరలు

 
విశాఖపట్నం అసలే పండుగ రోజులు. చుక్కలనంటిన ధరలతో పిండివంటలకు ఎలాగూ దిక్కులేదు. కనీసం పప్పన్నం తినే భాగ్యానికి కూడా నిరుపేదలు నోచుకోలేకపోతున్నారు. రేషన్‌షాపులో ఈనెల కూడా కందిపప్పు సరఫరా జరిగే అవకాశాలు కన్పించడం లేదు.
 జిల్లాలో బీపీఎల్ పరిధిలో 11.22లక్షల రేషన్‌కార్డులున్నాయి. కందిపప్పు కిలో రూ.50ల చొప్పున పంపిణీ చేసేవారు. మిగిలిన సరుకులు విషయం ఎలా ఉన్నా కందిపప్పు వరకు చూస్తే కార్డుకు కిలో చొప్పున మన జిల్లాలోని రేషన్‌కార్డుహోల్డర్లకు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలంటే 1122 మెట్రిక్ టన్నుల అవసరం. జూన్ వరకు అరకొరగా పంపిణీ చేసిన కందిపప్పును జూలై నుంచి పూర్తిగా నిలిపి వేశారు. కారణం జూలైలో 280ఎంటీలు మాత్రమే కేటాయిం చారు. ఇవి మూడోవంతు కార్డుదారులకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. దీంతో వీటి పంపిణీని నిలిపివేశారు. ఇటీవల రాష్ర ్టపౌర సరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత జిల్లాకు కేటాయించిన కంది పప్పు ఎందుకు పంపిణీచేయడం లేదంటూ మండిపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు సామాన్యులు కొనలేని స్థితికి చేరుకోవడంతో కనీసం అరకిలో చొప్పునైనా పంపిణీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. అరకిలో చొప్పున పంపిణీ చేయాలన్నా కనీసం 560 మెట్రిక్ టన్నుల వరకు కావాలి. అందు బాటులో కేవలం 280 ఎంటీలు మాత్రమే ఉండడంతో ఏ మూలకు సరిపోదన్న భావనతో పంపిణీ చేయలేదంటూ సివిల్‌సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు బదులిచ్చారు. ఇప్పటికే సబ్సిడీపై కందిపప్పు ఇచ్చేందుకు రూ.50కోట్లు ఖర్చు చేస్తున్నామని, జిల్లాఅవసరాలకు తగ్గట్టుగా కందిపప్పుకేటాయిస్తామని మంత్రిచెప్పుకొచ్చారు.

 ఇటీవలే మరో 170 మెట్రిక్ టన్నులు కేటాయించారు.ప్రస్తుతం నిల్వ ఉన్న 280 ఎంటీలతో కలుపుకొని జిల్లాలో 450 ఎంటీలు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. కనీసం అరకిలో చొప్పున పంపిణీ చేసేందుకు కూడా నిల్వలు సరిపోని పరిస్థితి. మరొక పక్క ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.170కు చేరింది. దీంతో రాష్ర్టస్థాయిలో టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రావడంలేదని,అందువలనే జిల్లాకు కేటాయింపులు జరపడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాస్థాయిలో ధరల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి నుంచి కందిపప్పు కొనుగోలు ఖర్చుచేసి జిల్లాలోని కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది.ఈ నెలలో కూడా పంపిణీ చేయకపోతే మరో వారం రోజుల్లో రానున్న వినాయకచవతి పండుగకు సామాన్యుల ఇంట పప్పన్నం కరువైనట్టే. జిల్లా అధికారులు ఇప్పటికైనా కందిపప్పు పంపిణీ విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement