ఉప ఎన్నికలకు కారణం ఆ హీరోలే
సాక్షి,తిరుపతి: తిరుపతి అసెంబ్లీకి ఇంతవరకూ రెండుసార్లు ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు సందర్భాల్లోను ఇద్దరు ప్రముఖ సినీ నటుల రాజీనామా వల్లే జరిగాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు తిరుపతి, హిందూపురం నుంచి పోటీ చేశారు. ఆయన రెండు చోట్లా విజయం సాధించారు. అయితే తిరుపతికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఇక 2009లో పీఆర్పీ అధినేత, ప్రముఖ నటుడు చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. ఆయన పాలకొల్లులో ఓడిపోవడంతో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో తిరుపతి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయి.