మహిళపై టీడీపీ నాయకుడి దాష్టీకం | TDP leader Over Action On Women at Kalyanadurgam | Sakshi
Sakshi News home page

మహిళపై టీడీపీ నాయకుడి దాష్టీకం

Sep 30 2018 9:22 AM | Updated on Sep 30 2018 9:22 AM

కళ్యాణదుర్గం: తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. అధికార పార్టీ నాయకుడి దాష్టీకం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనవద్ద అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించండి అని మహిళ కోరడంతో ఆగ్రహించిన నాయకుడు విచక్షణ కోల్పోయి ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా ఆమెను కిందపడేసి వివస్త్రను చేశాడు. బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడే సరికి సదరు నాయకుడు పలయానం చిత్తగించాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళితే... నియోజకవర్గంలోని ఓ మండల టీడీపీ మాజీ కన్వీనర్‌ తను సన్నిహితంగా ఉంటున్న మహిళ వద్ద అప్పు తీసుకున్నాడు. ఎన్ని రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో సదరు మహిళ రెండు రోజుల కిందట నిలదీసింది. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించేయాలని డిమాండ్‌ చేసింది. దీంతో అతను అందరూ చూస్తుండగానే దుర్భాషలాడుతూ ఆమెను ఊరి మధ్యలో కిందపడేశాడు. చీరను లాగి.. జాకెట్‌ చించి వివస్త్రను చేశాడు. తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లడంతో బాధితురాలు చెప్పు తీసుకుని తిరగబడింది.

 అంతే ఆ నేత అక్కడి నుంచి పారిపోయాడు. టీడీపీ నేత తీరును ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా నడి బజార్లో దుశ్వాసనపర్వానికి పాల్పడిన అతడిని తప్పుబట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. పోలీసులు సదరు నాయకుడిని అదుపులోకి తీసుకున్నప్పటికీ టీడీపీ ముఖ్యనేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో కనీస విచారణ కూడా చేయకుండా వదిలేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement