ఆగని గల్లా గూండాల ఆగడాలు | She switched gangster Galla | Sakshi
Sakshi News home page

ఆగని గల్లా గూండాల ఆగడాలు

Apr 29 2014 4:27 AM | Updated on Sep 2 2017 6:39 AM

ఆగని గల్లా గూండాల ఆగడాలు

ఆగని గల్లా గూండాల ఆగడాలు

చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి దౌర్జన్యాలు మితి మీరుతున్నాయి. శెట్టిపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై స్వైరవిహారం...

  •      నలుగురి కిడ్నాప్
  •      చోద్యం చూస్తున్న అధికారులు
  •  చంద్రగిరి, న్యూస్‌లైన్: చంద్రగిరి నియోజకవర్గంలో గల్లా అరుణకుమారి దౌర్జన్యాలు మితి మీరుతున్నాయి. శెట్టిపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై స్వైరవిహారం చేసి గాయపరిచిన సంఘటన మరవకముందే మళ్లీ గల్లా గూం డాలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. చంద్రగిరి మండలం పనబాకం పంచాయతీ ఇరుగురంగయ్యగారిపల్లెలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులపై సోమవారం సాయంత్రం దాడులు చేశారు. కర్రలు, ఇనుపరాడ్లతో ఆటోను ధ్వంసం చేశారు.

    అందులో వెళుతున్న  ఇద్దరిని చితకబాదారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు... సాయంత్రం  వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు ఆరుగురు గ్రామశివార్లలో మాట్లాడుకుంటున్నారు. అక్కడికి ఓ సుమోలో వచ్చిన గ్రామానికి చెందిన గల్లా అనుచరులు మురళి, ప్రేమ్‌కుమార్‌తోపాటు మరికొందరు ఆ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. మిగిలిన నలుగురిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గాయపరిచి వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయారు. పక్కకు తీసుకెళ్లిన ఆ ఇద్దరు లోకేష్, చంద్రబాబులను కర్రలతో చితకబాదడంతో తీవ్రగాయాలయ్యాయి. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అక్కడే వదలి పరుగెత్తుకుంటూ అమరరాజా స్టిక్కర్ ఉన్న సుమోలో పారిపోయారు. బాధితులు ఆటోలో రుయాకు వచ్చి చికిత్స పొందుతున్నారు.
     
    ఆ నలుగురిని ఏంచేశారు?
     
    బాధితుల వివరాల మేరకు  ఐ.రంగయ్యగారిపల్లికి చెందిన గల్లా అనుచరులు, వైఎస్‌ఆర్ సీపీకి చెందిన కార్యకర్తలు ఉమాపతి, వెంకటేశ్, మునికృష్ణ, భానును  టాటా సుమో లో కిడ్నాప్ చేశారు.  వారిని అమరరాజ ఫ్యాక్టరీకే తరలించి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకులను ఏం చేస్తారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ఆర్ సీపీలో పనిచేస్తున్నారనే కారణంతో యువకులను కిడ్నాప్ చేసి, బంధించారని గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.
     
    పాకాలలో ప్రచార రథంపై దాడి
     
    పాకాల మండలం కంబాలమిట్టలో ప్రచారం చేస్తున్న ప్రచార రథంపై గల్లా అనుచరులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ ఆమె అనుచరులు ప్రచార రథం డ్రైవర్ భవన్‌ను చితకబాదారు. అనుమతులు ఉన్న ప్రచార రథంలో పాటలు వేయవద్దంటూ, రథానికి ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. దీనిపై పాకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
     
    పట్టించుకోని అధికారులు

     
    మూడు రోజలుగా గల్లా అనుచరులు, అమరరాజ ఫ్యాక్టరీ సిబ్బంది వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, ప్రచార రథాలు, కళాకారులపై దాడులు చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలకు వెనుకాడుతున్నారు. ఉన్నతాధికారులపై గల్లా అరుణకుమారి తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు. అమరరాజ కంపెనీకి చెందిన వాహనాల్లో వచ్చి  దౌర్జన్యాలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీటిపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాంగోపాల్‌కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు సిద్ధమయ్యారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement