రైతుల భూములకు పూర్తి భద్రత | Security For Farmers Lands Says Pilli Subhash Chandra Bose | Sakshi
Sakshi News home page

రైతుల భూములకు పూర్తి భద్రత

Dec 29 2019 5:03 AM | Updated on Dec 29 2019 7:37 AM

Security For Farmers Lands Says Pilli Subhash Chandra Bose - Sakshi

నెల్లూరు (అర్బన్‌): రాష్ట్రంలో భూ రికార్డులను ల్యాండ్‌ ప్యూరిఫికేషన్‌ (భూ రికార్డుల ప్రక్షాళన) చేసి వెబ్‌ ల్యాండ్‌ రికార్డుల్లో నమోదు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి  (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ చెప్పారు. శనివారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజుతో కలిసి నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యాధునిక సాంకేతికతతో వెబ్‌ ల్యాండ్‌ ప్రక్రియ జరుగుతోందన్నారు. దీనివల్ల రైతుల భూముల రికార్డులు పక్కాగా ఉంటాయని తెలిపారు. జూలై నుంచి మూడు నెలల పాటు భూములకు సంబంధించి ఆడిట్‌ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో భూ రైతు యాజమాన్య హక్కు చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  తెస్తున్నారన్నారు. తద్వారా రైతుల భూమికి పూర్తి భద్రత కలుగుతుందని చెప్పారు.

ఇంటి స్థలాలు కోరుతూ 28 లక్షల దరఖాస్తులు
గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం సుమారు 28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయనుందని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలం ఇస్తామని చెప్పారు. జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ చుక్కల భూములు, సీజేఎఫ్‌ఎస్‌ డీ ఫాం పట్టా భూముల్లో నివాసముంటున్న వారి పేరిట సంబంధిత భూములను క్రమబద్ధీకరించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement