చేయని నేరానికి... | RTC officials checks | Sakshi
Sakshi News home page

చేయని నేరానికి...

May 20 2014 2:10 AM | Updated on Sep 2 2017 7:34 AM

ఆయన పేరు వీఎస్‌రెడ్డి. కోడ్ నెం. ఈ.412461. కడప ఆర్టీసీడిపోలో కండక్టర్‌గా ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 10.5.2014న బద్వేల్ సర్వీసుకు వెళ్లారు.

యన పేరు వీఎస్‌రెడ్డి. కోడ్ నెం. ఈ.412461. కడప ఆర్టీసీడిపోలో కండక్టర్‌గా ఏడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. 10.5.2014న బద్వేల్ సర్వీసుకు వెళ్లారు.  నాల్గొవ ట్రిప్‌లో ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిద్దవటం నుంచి వచ్చిన ఇరువురు ప్రయాణికులకు ఒకే వ్యక్తి రెండు టికెట్లు తీసుకున్నాడు. టికెట్లు ఉన్న ప్రయాణికుడు మధ్యలో దిగిపోయాడు. ఇంకో ప్రయాణికుడు పాతబస్టాండు వరకూ బస్సులో వచ్చారు. తనిఖీల సందర్భంగా... మేము కలిసే వచ్చాం.. టికెట్‌కు డబ్బులు తీసుకున్నారు.. మాకు కండక్టర్ ఇచ్చిన టికెట్ ఇదేనంటూ మరో ప్రయాణికుడు బుకాయించాడు. అంతే వాస్తవాలతో నిమిత్తం లేకుండా కేసు నమోదు.. ఆపై చార్జీ మెమో.. అనంతరం సస్పెండ్ చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, కడప: ‘అరిటాకు వెళ్లి ముళ్లుపై పడ్డా.. ముళ్లు వచ్చి ఆకుపై పడ్డా చినిగేది అరిటాకే’ అన్న సామెత తుచ తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తోంది. ప్రయాణికులు చేసిన, చేస్తున్న పొరపాట్లు కండక్టర్లకు వేదనను మిగిలుస్తున్నాయి.  తనిఖీ అధికారులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. విచారణలో అలసత్వం కారణంగా కార్మిక కుటుంబాలు నడిరోడ్డుపై పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. విధినిర్వహణలో  నిక్కచ్చిగా పనిచేస్తున్నా  వే ధింపులు తప్పడం లేదని పలువురు వాపోతున్నారు.

అంతా నీతిపరులేనా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. చేయని తప్పుకు నేరాన్ని అపాదించడం ఎంతమాత్రం సరైంది కాదని పలువురు ఆక్షేపిస్తున్నారు. వీఎస్‌రెడ్డి లేదా ఎండీ భూషణంలకు అప్పగించిన టికెట్లు.. ప్రయాణికులకు పోను మిగిలిన టికెట్లు,, చార్ట్‌లో నమోదైన టికె ట్ల వివరాలను పరిశీలిస్తే వాస్తవంగా తప్పు చేశారా.. సంస్థను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారా అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం.. ఆపై సస్పెండ్  చేయడం  ఆర్టీసీలో రివాజుగా మారిందని పలువురు కార్మికులు వాపోతున్నారు.
 
 విచారణలో అలసత్వం....
 కండక్టర్లు తప్పులు చేశారని ఆరోపణలు రాగానే స్పందించే యంత్రాంగం ఆపై విచారణలో వాస్తవమా? కాదా? అన్న విషయం నిర్ధారణ చేసి తగిన విధంగా స్పందించకుండా  మిన్నకుండిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో కేసులు  పెండిం గ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప డిపో పరిధిలోనే ఎనిమిది మంది కార్మికులు ఇలాంటి  పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేవలం ప్రయాణికులు తనిఖీ అధికారులను మభ్యపెట్టడం కారణంగా కేసులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. కుటుంబాలను వీధులపాలు చేసుకోలేని కార్మికులు దళారులను ఆశ్రయించి సస్పెన్షన్‌ను  తొల గించుకుంటున్నట్లు తెలుస్తోంది. నాకు ఎలాంటి సంబంధంలేదు..  అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయండి మహాప్రభో అని మొరపెట్టుకుంటున్న వారిని కనికరించడం లేదు.  ఈవిషయమై ఆర్టీసీ కడప డిపోమేనేజర్ శ్రీనివాసలురెడ్డిని  వివరణ కోరేందకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోన్ సైతం లిప్ట్ చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement