ఢిల్లీ: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో దారుణం జరిగింది. స్లీపర్ బస్సులో ఓ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ కేసులో బస్సు డ్రైవర్, కండక్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. బస్సులో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె పేర్కొంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగ్గా.. నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలు పీతంపురలోని మంగోల్పురిలోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తోంది. మే 11వ తేదీ రాత్రి సదరు మహిళ పని ముగించుకుని ఎప్పటిలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో సరస్వతి విహార్లోని బస్టాప్ వద్ద ఓ స్లీపర్ బస్సు ఆగింది. బస్సు తలుపు వద్ద నిలబడిన వ్యక్తిని ఆమె సమయం ఎంత అని అడిగింది. ఆ సమయంలో నిందితులు ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు.
అనంతరం నిందితులు బస్సును నాంగ్లోయ్ వైపు నడిపారు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. బస్సును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుగుతోందని.. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.


