ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
నేడు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం వెయ్యి కోట్ల ప్యాకేజీకి ఆమోదముద్ర వేయనున్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నిర్మించుకునే కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కేంద్ర బడ్జెట్లో దీని ప్రస్తావన లేదు.
రాజధానికి సంబంధించి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందడంలో జాప్యం కావడం, వాటి పరిశీలన పూర్తి కాకపోవడం వంటి కారణాలతోనే బడ్జెట్లో ప్రస్తావన చేయలేదని చెబుతున్నారు. అయితే ప్యాకేజీ అంశాన్ని బుధవారం నాటి కేబినెట్ ఎజెండాలో చేర్చి, వెయ్యి కోట్ల మేరకు సహాయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం.