కనిగిరికి కష్టాలే | problems to kanigiri town | Sakshi
Sakshi News home page

కనిగిరికి కష్టాలే

Sep 27 2013 3:54 AM | Updated on Aug 27 2018 9:16 PM

కనకపట్నంగా పేరొందిన కనిగిరికి రాష్ట్ర విభజనతో నీటి కష్టాలు తప్పేలా లేవు. ఈ భయం కనిగిరి ప్రాంత ప్రజలను ప్రస్తుతం వెంటాడుతోంది.

 కనిగిరి, న్యూస్‌లైన్ :
 కనకపట్నంగా పేరొందిన కనిగిరికి రాష్ట్ర విభజనతో నీటి కష్టాలు తప్పేలా లేవు. ఈ భయం కనిగిరి ప్రాంత ప్రజలను ప్రస్తుతం వెంటాడుతోంది. పశ్చిమ ప్రకాశం ప్రజలను ఫ్లోరైడ్ రక్కసి నుంచి కాపాడేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి *175 కోట్లతో కష్టాలే రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. 2008లో పథకానికి శంకుస్థాపన చేసి తొలి విడత నిధులు కూడా మంజూరు చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 448 గ్రామాలున్నాయి. *175 కోట్లతో 367 గ్రామాలకు రామతీర్థం ప్రాజెక్టు నుంచి, * 52 కోట్లతో చందవరం ప్రాజెక్టు నుంచి 78 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా పథకాన్ని రూపకల్పన చేశారు. రామతీర్థం ప్రాజెక్టు ద్వారా 258 గ్రామాలకు తాగునీరు గతేడాది నుంచి అందిస్తున్నారు. మరో 109 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. చందవరం ప్రాజెక్టు ద్వారా ఏడాది నుంచి సుమారు 60 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఈ గ్రామాలకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకం కానుంది.
 
 విభజనతో నష్టం ఇలా..
 రామతీర్థం జలాశయానికి సాగర్ కుడి కాలువ నుంచి నీరు వస్తుంది. గుంటూరు నుంచి పుల్లలచెరువు, త్రిపురాంతకం మీదుగా దర్శికి అక్కడి నుంచి రామతీర్థం జలాశయం డ్యామ్‌కు నీరు చేరుతుంది. అక్కడి నుంచి కొంత వ్యవసాయానికి, ఎక్కువ శాతం తాగేందుకు నీరు సరఫరా చేస్తారు. రామతీర్థం జలాశాయం స్టోరేజ్ పాయింట్ నుంచి కందుకూరు పట్టణం, తాళ్లూరు, కనిగిరి నియోజకవర్గానికి తాగునీరు సరఫరా చే స్తున్నారు. విభజన ప్రక్రియతో సాగర్ ప్రాజెక్టుకు నీటి సరఫరా అంతంత మాత్రమేనని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగితే నల్గొండ జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు నాగార్జున సాగర్ నుంచి తగినంత తాగునీరు సరఫరా కావడం అనుమానమే. హనుమంతునిపాడు మండలంతో పాటు కొన్ని గ్రామాలకు తాగునీరు అందించే చందవరం ప్రాజెక్టుకు కూడా సాగర్ నుంచే నీరు సరఫరా కావాల్సి ఉంది. దీనికీ నీటి ముప్పు తప్పదు.  
 
 నిరుపయోగం కానున్న రక్షిత మంచినీటి పథకం
 రాష్ట్ర విభజన జరిగితే *175 కోట్ల ప్రాజెక్టు ఎండమావిగా మారే ప్రమాదం ఉంది. అధికారిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో సుమారు 3 లక్షల మంది దాహార్తి తీర్చుకుంటున్నారు. ఇప్పటికి రెండు విడతలుగా మంజూరైన నిధులు *140 కోట్లతో పనులు జరిగాయి. 60 ఓహెచ్‌ఎస్‌ఆర్ (ఓవర్ హైట్ సర్వీసెస్ రిజర్వాయర్ ట్యాంక్)లు, 3 ఓహెచ్‌బీఆర్ (ఓవర్ హైట్ బ్యాలెన్స్ రిజర్వాయర్) ట్యాంక్‌లు, 2 ఆర్‌ఎస్‌ఎఫ్( నీటి పారిశుధ్య ట్యాంకులు)లు నిర్మించి నీరు సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోతే పథకంగా నిరుపయోగం కావడం ఖాయం.
 
 మళ్లీ వెంటాడనున్న ఫ్లోరైడ్ భూతం
 నీటి సమస్యకు నిలయం కనిగిరి. రాష్ట్రంలో నల్గొండ జిల్లా తర్వాత అత్యధికంగా ఫ్లోరైడ్ పీడితులు కనిగిరిలోనే ఎక్కువగా ఉన్నారు. కనిగిరి బొగ్గుల గొంది కాలనీ, దిరిశమంచ, కమ్మవారి పల్లి, పునుగోడు ఎస్టీ కాలనీలతో పాటు, పీసీపల్లి, సీఎస్ పురం మండలాల్లో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ. అక్కడి వారు కొంతమంది ఆకాశం వైపు చూడాలంటే ఇప్పటికీ నేలపై పడుకోవాల్సిన పరిస్థితి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ఇప్పుడిప్పుడే ఫ్లోరైడ్ రక్కసి నుంచి బయటపడుతున్నారు. ప్రస్తుతం 258 గ్రామాలకు రోజూ 2 కోట్ల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు అంచనా. ఈ నీరు ఆగిపోతే మళ్లీ ఫ్లోరైడ్ భూతం పట్టిపీడించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement