ప్రైవేటు పాఠశాలల బంద్ రేపు | Private schools bandh Tomorrow | Sakshi
Sakshi News home page

ప్రైవేటు పాఠశాలల బంద్ రేపు

Sep 4 2013 3:15 AM | Updated on Sep 1 2017 10:24 PM

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్

 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ (ఏపీటీసీఏ) ఆధ్వర్యంలో నగరంలో పాఠశాలలు మూసివేసి స్థానిక ప్రకాశం భవనం వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని ఏపీటీసీఏ నగరశాఖ సమావేశంలో నిర్ణయించారు. మంగళవారం రాత్రి స్థానిక మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఏపీటీసీఏ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
 
 సమావేశానికి ఏపీటీసీఏ నగర శాఖ అధ్యక్షుడు జాలిరెడ్డి అధ్యక్షత వహించారు. గురువారం పాఠశాలలన్నింటినీ మూసివేసి స్థానిక ప్రకాశం భవనం వద్దే ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించి అక్కడే సామూహిక నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ  దీక్షల్లో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న సుమారు 600 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారు. ఉదయం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పిస్తారు. ఆట, పాట ద్వారా సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తారు. ప్రకాశం భవనం ఎదుటే విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
 
 సాయంత్రం నిరాహార దీక్ష శిబిరం వద్దే రోడ్డు మీద వంటావార్పు చేస్తారు. కార్యక్రమంలో నగరంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని ఏపీటీసీఏ రాష్ట్ర నాయకుడు మాంటిస్సోరి ప్రకాష్‌బాబు కోరారు. సమావేశంలో ఏపీటీసీఏ కార్యదర్శి సురేష్, కోశాధికారి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు ఏవీ రమణ, ఆంధ్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement