పోలీస్‌స్టేషన్‌లో సోమిరెడ్డి

Police Investigation to Somireddy Chandramohan Reddy - Sakshi

భూ వివాదంలో ఏ1 నిందితుడిగా కేసు నమోదు

నాలుగు గంటల పాటు విచారణ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వెంకటాచలం: మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. భూ వివాదం కేసులో ఏ–1 నిందితుడిగా సమన్లు తీసుకుని, వారం నుంచి హాజరుకాకుండా అదృశ్యమైన సోమిరెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడి శుక్రవారం సీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమిరెడ్డితో పాటు ఆయన కుమారుడు  రాజగోపాలరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఇతర పార్టీ నేతలతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. ఇడిమేపల్లి భూ వివాదంపై కోర్టు ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు గత నెల 27వ తేదీన కేసు నమోదు చేశారు. ఇడిమేపల్లిలో సర్వే నంబరు 58/3లోని 2.41 ఎకరాల  ప్రైవేట్‌ భూమికి సోమి రెడ్డి తన రాజకీయ ప్రాబల్యంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తొలుత తన పేరుతో మార్చుకుని ఆ తర్వాత ఇతరులకు అమ్మేశాడని భూమి యజమాని బాధితుడు ఏలూరు రంగారెడ్డి కోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ కేసు విచారణ నిమిత్తం పలు దఫాలు వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డికి సమన్లు ఇచ్చినా, వస్తానని విచారణకు గైర్హాజరయ్యారు. విచారణకు సహకరించకుండానే బెయిల్‌ కోసం కోర్టులో సోమిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశిం చింది. ఆ మేరకు గురువారం రాత్రి నెల్లూరు రూ రల్‌ సీఐ రామకృష్ణ అల్లీపురంలోని సోమిరెడ్డి నివా సానికి వెళ్లి విచారణకు హాజరుకావాలని మరో సారి నోటీసులు జారీ చేశారు. దీంతో సోమిరెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు   పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని విచారణాధికారి సీఐ రామకృష్ణ వద్ద హాజరయ్యారు. సోమిరెడ్డితో పాటుగా న్యాయవాది వడ్డే శ్రీనివాసరావు వచ్చారు. భూ వివాదానికి సంబంధించి పలు డాక్యుమెంట్లు చూ పించారు. ఈ కేసు విచారణను నాలుగు గంటల పాటు కొనసాగింది. సోమిరెడ్డిని అరెస్ట్‌ చేస్తున్నారంటూ పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చిన టీడీపీ నాయకులే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే 2.30 గంటల సమయంలో ఆయన బయటకు వచ్చారు తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భయపడనని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top