ఆభరణాల చోరీ కేసు నిందితుల అరెస్టు | Sakshi
Sakshi News home page

ఆభరణాల చోరీ కేసు నిందితుల అరెస్టు

Published Tue, Aug 26 2014 3:20 AM

Persons arrested for jewelery theft case

నందిగామ : పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణంలో కొన్ని నెలల క్రితం జరిగిన చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.7.50 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నందిగామ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ చిన్నహుస్సేన్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు.

ఫిబ్రవరిలో నంది గామ ప్రభుత్వాస్పత్రి ఎదురుగా శ్రీనివాస సిల్వర్ అండ్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో ఉన్న నగల దుకాణం వెనుక వైపు షట్టర్ పగలగొట్టి లోనికి చొరబడిన దుండగులు సుమారు రూ.30 లక్షల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, రూ.3.75 లక్షల నగదును చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన షేక్ అబ్దుల్, అబ్దుల్ బారిక్, ఉపేంద్రషాను ఈ కేసులో నిందితులని, వారికి బషిరుద్దీన్ గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరించాడని గుర్తించారు.

మరి కొందరికి కూడా ఈ చోరీలో సంబంధం ఉందని అనుమాని స్తున్నారు. షేక్ అబ్దుల్, అబ్దుల్ బారిక్, ఉపేంద్రషా సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద 300 గ్రాముల బంగారం ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుంది. చోరీ కేసుతో సంబంధం ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీ సులు గాలింపు చర్యలు చేపట్టారు.   స్వాధీనం చేసుకున్న ఆభరణాలను మీడియా ముందు ఉంచారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు, ఎస్‌ఐలు ఏసుబాబు, తులసిరామకృష్ణ, ఏఎస్‌ఐ రామారావు  పాల్గొన్నారు.  
 
ఆరు నెలలకు ముగ్గురి అరెస్టు
 
ఆభరణాల చోరీ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఆరు నెలల సమయం పట్టింది. ఈ దుకాణంలో రూ.30 లక్షలకు పైగా విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురైతే కేవలం రూ.7.50 లక్షల విలువ చేసే ఆభరణాలను మాత్రమే రికవరీ చేయగలిగారు. నందిగామ పోలీసులకు నేరస్తులను గుర్తించేందుకే ఆరు నెలలు సమయం పట్టింది. మొత్తం మీద ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పోలీసులు కొంత మేర రికవరీచేశారు. ఇక ఇటీవల కాలంలో నందిగామ పట్టణంలో జరిగిన అనేక చిన్నచిన్న చోరీల కేసుల్లో విచారణ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉంది.
 

Advertisement
Advertisement