అనంతపురం జిల్లాలో చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కదిరి: అనంతపురం జిల్లాలో చిన్నారి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బాధితులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కదిరి చెందిన రఘునాథ్గుప్తా, సుమతి దంపతుల కుమార్తె హిమబిందు(3)కు జ్వరం రావటంతో రెండు రోజుల క్రితం స్థానిక పద్మావతి ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, జ్వరం తగ్గడంతో గురువారం రాత్రి బాలికను డిశ్చార్జి చేశారు.
అయితే, శుక్రవారం తెల్లవారు జామున ఒక్కసారిగా జ్వరం పెరిగిపోవటంతో ఆస్పత్రికి ఫోన్ చేశారు. అయితే, ఆ సమయంలో నర్సులెవరూ లేరని, ఆస్పత్రిలో సెలైన్ బాటిళ్లు కూడా అయిపోయాయని డాక్టర్ మారుతీవరప్రసాద్ తెలిపారు. కొద్దిసేపటికే హిమబిందు చనిపోయింది. దీంతో బాధితులు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం 205వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇరువర్గాల వారితో పోలీసులు సంప్రదింపులు జరిపి ఆందోళణను శాంతింపజేశారు.