‘‘ఈ ఎన్నికల్లో మోసపోతే మళ్లా గోసపడతం. మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉండాలె.
* మన రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉండాలె: కేసీఆర్
* అట్లయితెనే ఆశించిన పునర్నిర్మాణం సాధ్యం
* ఎక్కువ మంది ఎంపీలుంటేనే ఢిల్లీ మాట వింటది
* ఇతర పార్టీల మాయ మాటలు నమ్మొద్దు
గద్వాల, న్యూస్లైన్: ‘‘ఈ ఎన్నికల్లో మోసపోతే మళ్లా గోసపడతం. మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉండాలె. ఎవరి మాయమాటలు నమ్మకుండా ప్రజలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మన ప్రభుత్వమే వచ్చేలా చెయ్యాలె...’’ అని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకుంటేనే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను రాబట్టుకోగల మని.. ఎక్కువ మంది ఎంపీలుంటేనే మన డిమాండ్లకు ఢిల్లీలో విలువ ఉంటుందని పేర్కొన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఎన్నికల సందర్భంగా ఎన్నో పార్టీల నాయకులు ప్రజల ముందుకొస్తరు.. ఏవేవో మాయమాటలు చెబుతారు.. అవి నమ్మొద్దు.. మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటేనే ఆశించిన పునర్నిర్మాణం సాధించగలం..’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా ఢిల్లీలో తాను ఎన్ని ఇబ్బందులు పడ్డానో అందరికీ తెలుసని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మిగతా పార్టీల నేతలను, మాటలను నమ్మొద్దని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 14ఏళ్లుగా ఉద్యమాన్ని కొనసాగించి, రాష్ట్రాన్ని సాధించిన మనం మన ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకునేలా టీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే జీవో జారీ చేస్తామని, మత్స్యకారులను బీసీ ‘ఏ’ గ్రూపులో చేర్చేందుకు ప్రయత్నిస్తామని కేసీఆర్ చెప్పారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని పేర్కొన్నారు.
ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిని చంద్రబాబే ప్రవేశపెట్టారని, అది శ్రమదోపిడీ కాదా? అని కేసీఆర్ ప్రశ్నిం చారు. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, పాలమూరును పచ్చని పొలాల జిల్లాగా మార్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. ఇదే వేదికపై గద్వాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణమోహన్రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలైన తరువాత మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కె.కేశవరావు, పొలిట్బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్రెడ్డి, నాగర్కర్నూలు ఎంపీ మందా జగన్నాథం, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరుకు పెద్దపీట..
తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని.. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేయడంతో పాటు 14లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కృష్ణా, తుంగభద్ర నదుల నడిగడ్డలో కరువు ఉందంటే పాలకుల చేతగానితనమే దానికి కారణమని ఆయన విమర్శించారు. ఆంధ్ర మాయా నేతల బూట్లు తూడిచే నాయకులు తెలంగాణలో ఉన్నారని, అందువల్లే ఇక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.