ఓరి దేవుడా.. | one person died due to bike accident | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా..

Nov 14 2013 4:14 AM | Updated on Sep 2 2017 12:34 AM

‘ఓరి దేవుడా...ఎంత పని చేశావయ్యా.. నీ దర్శనానికి వచ్చిన మా బిడ్డలను మాకు శాశ్వతంగా దూరం చేస్తావా.. ఇక మాకు దిక్కెవ రు సామీ..

కణేకల్లు, న్యూస్‌లైన్ : ‘ఓరి దేవుడా...ఎంత పని చేశావయ్యా.. నీ దర్శనానికి వచ్చిన మా బిడ్డలను మాకు శాశ్వతంగా దూరం చేస్తావా.. ఇక మాకు దిక్కెవ రు సామీ..’ అంటూ ఆ తల్లిదండ్రులు రోదించడం పలువుర్ని కంటతడి పెట్టించింది. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి.. బైక్‌పై వస్తూ నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి తుంబిగనూరు గ్రామానికి చెందిన బోయ భీమలింగ (20), కురుబ శివకుమార్ (16), బోయ నరసింహులు (16) అనే విద్యార్థులు మృతి చెందారు. వీరు స్నేహితులతో కలిసి ఎన్.హనుమాపురంలో లాలుస్వామి పీర్లదేవుని ఉత్సవాలు చూసి... ద్విచక్ర వాహనాలపై తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.
 
 అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నావే...!
 ‘స్నేహితునితో కలిసి పండగకొచ్చిన మా కొడుకును అన్యాయంగా పొట్టన పెట్టుకొన్నావే! మేం ఏం పాపం చేశావని ఈ శిక్ష వేశావ్? ఆరాధ్య దైవంగా భావించే నిన్ను దర్శించుకొద్దామని వస్తే నీ వద్దకే ర ప్పించుకున్నావే! మాకు గుండెకోత మిగిల్చావా.. దేవుడా. సర్వం కొడుకేనని బతుకుతున్న మేము ఇంకెవరి కోసం బతకాలి’ అంటూ భీమలింగ తల్లిదండ్రులు పార్వతమ్మ, లక్ష్మణ్ణ కన్నీరు మున్నీరయ్యారు.
 
 వీరికి భీమలింగతో పాటు కూతురు రత్న సంతానం. రత్నకు వివాహమైంది. పేద రైతు అయిన లక్ష్మణ్ణ కష్టపడి వ్యవసాయం చేస్తూ కొడుకును నెల్లూరులోని శాస్త్ర కాలేజీలో బీఫార్మసీ చదివిస్తున్నాడు. ప్రస్తుతం అతను సెకండియర్ చదువుతున్నాడు. స్వగ్రామంతో పాటు ఎన్.హనుమాపురంలో లాలుస్వామి పీర్లదేవుని ఉత్సవాలు ఘనంగా జరుగుతుండటంతో భీమలింగ శనివారం ఊరికి వచ్చాడు.
 
 తన కాలేజీలోనే థర్డ్ ఇయర్ చదువుతున్న ఒంగోలుకు చెందిన మిత్రుడు ప్రసాద్‌ను కూడా వెంట తీసుకొచ్చాడు. ఎన్.హనుమాపురంలో చిన్నసరిగెత్తు ఉత్సవానికి స్నేహితులతో కలిసి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ‘బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. మమ్మల్ని ఏ కష్టమూ లేకుండా చూసుకొంటానని చెప్పితివే. అప్పుడే మమ్మల్ని వదిలి పైకి వెళ్లిపోయావా తండ్రీ’ అంటూ భీమలింగ తల్లి పార్వతమ్మ  విలపించడం అక్కడున్న అందరినీ కలచివేసింది. పండగ కోసం వచ్చి తన ప్రాణ స్నేహితుణ్ని కోల్పోయానంటూ ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. భీమలింగ బైక్‌లో తాను రావాల్సిందని, అయితే.. తనను మరో బైక్‌లో ఎక్కించాడని అతను తెలిపాడు.  
 
 నా ప్రాణాలైనా తీసుకోలేకపోయావా... దేవుడా!
 ‘చెట్టంత కొడుకును బలి తీసుకొనేందుకు నీకు మనసెలా ఒప్పింది? నా ప్రాణాలైనా తీసుకోలేకపోయవా దేవుడా’ అంటూ శివకుమార్ తల్లి సిద్దమ్మ కన్నీరు మున్నీరైంది. సిద్దమ్మ, వెంకటేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. పెద్ద కొడుకు శివకుమార్ కణేకల్లులో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చిన్నకొడుకు అనిల్ అదే గ్రామంలో ఐదో తరగతి చదువుతున్నాడు. సంతోషంగా పండగ చేసుకుందామనుకొంటే మా ఇంట్లో దీపాన్నే అర్పేశావా అంటూ శివకుమార్ కుటుంబ సభ్యులు విలపించారు.
 
 త్వరగా వస్తానని.. శవంగా వచ్చావా నాయనా..
 ‘లాలుస్వామిని దర్శించుకొని త్వరగా వస్తానని చెప్పి... శ వంగా వచ్చావా నాయనా’ అంటూ బోయ నరసింహులు తల్లి రుక్మిణమ్మ గుండెలవిసేలా విలపించింది. రుక్మిణమ్మ, గజేంద్ర దంపతులకు ముగ్గురు కొడుకులు. వీరిది నిరుపేద కుటుంబం. గజేంద్ర పెద్ద కొడుకు అశోక్‌తో కలిసి హమాలీ, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రెండో కొడుకు ఆనంద్, చిన్నకొడుకు నరసింహులును చదివిస్తున్నారు. ఆనంద్ ఉరవకొండ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నాడు. నరసింహులు పదో తరగతి ఫెయిలయ్యాడు. మళ్లీ పరీక్ష రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. బాగా చదివించి కొడుకులను ప్రయోజకులు చేయాలనే తల్లిదండ్రుల కోరిక. ఇంతలోనే నరసింహులు చనిపోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement