అక్టోబర్ చివరి వరకు అందరికీ ‘ఆధార్’ | October last Until All the 'Aadhar' | Sakshi
Sakshi News home page

అక్టోబర్ చివరి వరకు అందరికీ ‘ఆధార్’

Sep 20 2013 3:03 AM | Updated on Sep 1 2017 10:51 PM

అక్టోబర్ నెలాఖరు నాటికీ అందరికీ ఆధార్‌కార్డుల నమోదును పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు.

చౌటుప్పల్, న్యూస్‌లైన్  :అక్టోబర్ నెలాఖరు నాటికీ అందరికీ ఆధార్‌కార్డుల నమోదును పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం లక్కారం శివారులోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇంకా 6లక్షల మందికి ఆధార్‌ను నమోదు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 155 కేంద్రాలు ఆధార్ నమోదు కోసం ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా లక్ష మందికి ఆధార్ నమోదు పూర్తయ్యిందని, మిగతా 5లక్షల మందికి అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏడో విడత భూ పంపిణీకి సంబంధించి 6వేల ఎకరాలను గుర్తించామన్నారు. 
 
 2వేల ఎకరాల్లో సర్వే పూర్తయ్యిందని, ఈ నెలాఖరు నాటికి పంపిణీకి సిద్ధం చేస్తామన్నారు. చౌటుప్పల్, చిట్యాల మండల కేంద్రాల్లో హైవే విస్తరణ పూర్తి కాలేదన్నారు. చౌటుప్పల్‌లో ఈద్గాకు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో 35 నిర్మాణాలకు నష్ట పరిహారాన్ని చెల్లిస్తున్నామన్నారు. చిట్యాలలో నిర్వాసితులు కోర్టులో 5రిట్ పిటిషన్లు దాఖలు చేయగా, కౌంటరు పిటిషన్లు వేశామన్నారు.  జిల్లాలో కాల్వల కింద భూసేకరణకు సంబంధించి మరో 15రోజుల్లో రూ.4కోట్లు విడుదల చేస్తామన్నారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీఓ భాస్కర్‌రావు, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, డీఐ వెంకట్‌రెడ్డి, వీఆర్వోలు గాలయ్య, సైదాసాహెబ్ తదితరులున్నారు. 
 
 ధర్మారం కాలువను సందర్శించిన జేసీ
 ఆత్మకూరు(ఎం) : తిమ్మాపురం, నాంచారిపేట గ్రామాల వద్ద ధర్మారం కాలువను జాయింట్ కలెక్టర్ హరి జవహర్ లాల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కాలువ మ్యాప్‌ను పరిశీలించారు. మండల పరిధిలో 11 గ్రామాలు కాలువ కింద ఉన్నట్లు తెలిపారు. 78మంది రైతులకు పరిహారం అందాల్సి ఉందన్నారు.  ఈ సందర్బంగా పలువురు రైతులు పరిహారం ఎక్కువ మొత్తంలో కావాలని డిమాండ్ చేయడంతో తాము పరిహారం ఇచ్చేది ఇస్తాం.. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే అటువంటి రైతులు కోర్టును ఆశ్రయించవచ్చునని అన్నారు. జేసీ వెంట భువనగిరి ఆర్డీఓ ఎ.భాస్కర్‌రావు, తహసీల్దార్ డి. కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ జిల్లాల శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు బీసు చందర్‌గౌడ్, నోముల నర్సిరెడ్డి, పైళ్ల తులశమ్మ, ఆర్‌ఐ చిప్పలపెల్లి యాదగిరి, నాయకులు పైళ్ల సత్యనారాయణరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి ఉన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement