పారా మెడికల్ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు కరువు | No students for para medical counselling | Sakshi
Sakshi News home page

పారా మెడికల్ కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు కరువు

Oct 29 2013 7:00 AM | Updated on Sep 2 2017 12:06 AM

పారా మెడికల్ కోర్సుకు అభ్యర్థులు కరువైపోతున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది.

విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్:  పారా మెడికల్ కోర్సుకు అభ్యర్థులు కరువైపోతున్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశానికి మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగం సీట్లకు కూడా దరఖాస్తులు రాలేదు. మరికొన్ని కోర్సులకైతే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో కౌన్సెలింగ్ ఎలా చేయాలా అని అధికారులు, నర్సిం గ్ కళాశాల యజమానులు తల పట్టుకుంటున్నారు. జిల్లాలో 13 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వ సీట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సీట్ల భర్తీకి మంగళవారం కౌ న్సిలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రభు త్వ సీట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు కరువయ్యారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో పాటు కళాశాలల యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
 సీట్ల వివరాలు
 డీఎంఎల్‌టీ కోర్సుకు సంబంధించి 100 సీట్లకు గాను కేవలం 31 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఎనస్తీషియా టెక్నీషియన్‌కు 10 సీట్లకు గాను 8 మంది, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్స్ 36 సీట్లకుగాను 10 మంది దరఖాస్తు చేసుకున్నారు. డార్క్ రూం అసిస్టెంట్ 12 సీట్లకు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కు కూడా పది సీట్లకు ఒక్క దరఖాస్తు వచ్చింది. అఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ 14కుగాను 7, ఆడియోమెట్రిక్ 30 సీట్లకుగాను 3 మాత్రమే వచ్చాయి. అప్టోమెట్రిక్ విభాగంలో 6 సీట్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా దరఖాస్తులు వచ్చిన వాటికి మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement