ఆన్‌లైన్‌లో పురపాలన! | Municipal Service Commission Official Website | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో పురపాలన!

Feb 22 2015 1:30 AM | Updated on Oct 16 2018 6:27 PM

జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇకపై పౌర సేవలన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఇకపై పౌర సేవలన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పురపాలక సంఘాల్లో పరిస్థితులను ముఖ్యమంత్రి, సంబంధిత     మంత్రి ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారానే పురపాలనను సమీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పన్నుల వసూళ్లు, చెత్త సేకరణ, అభివృద్ధి ప   నులకు సంబంధించిన ప్రతిపాదనలు, వీధి లైట్ల నిర్వహణ, మున్సిపల్ ఆస్తులతో పాటు ప్రతి అంశాన్ని అందరూ ఆన్‌లైన్‌లో చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపై రోజు వారి కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు కూడా నిత్యం ఆన్‌లైన్‌లో ఆప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.
 
 ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తు ల గుర్తింపునకు జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఖాళీ స్థలాలు, పార్కులు, పాఠశాలలు ఇతర మున్సిపల్ ఆస్తుల వివరాలను విస్తీర్ణంతో సహా జియో ట్యాగింగ్‌లో నమోదు చేస్తారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఆస్పత్రులు, రోడ్లు వంటి సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరుస్తారు. ప్రతి ఆస్తికి ఒక నంబర్ కేటాయిస్తారు. తద్వారా ఆస్తుల ఆక్రమణలను ఉన్నతాధికారులు ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది. అలాగే పట్టణ ప్రజలు పురపాలక సంఘం నుంచి సత్వర సేవలు పొందేందుకు వీలుగా ఈ-సువిధ కార్యక్రమాన్ని అ మలు చేయనున్నారు. ఇందులో మొత్తం 18 అంశాలను చేర్చారు. ఇంటి పన్ను, ఆక్రమణ, ప్రకటన, వ్యాపార లెసైన్సు, మంచినీటి పన్నులకు ఇకపై ఆన్‌లైన్‌లోనే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది.
 
 భవనాలకు సంబంధించిన ప్లాన్‌లనూ కూడా ఆన్‌లైన్ ద్వారానే మంజూరు చేస్తారు. పారిశుద్ధ్య పనుల తీరుపై కూడా ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షణ జరగనుంది. వాస్తవానికి పట్టణాల్లో చేపట్టే పనులపై నిత్యం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పనుల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎంబిన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే శానెట రీ ఇన్‌స్పెక్టర్లకు స్మార్ట్ ఫోన్‌లు కూడా అందజేశారు. ఈ ఫోన్‌ల ద్వారా వీధుల్లో ఉన్న చెత్త కుప్పలకు ముందుగా ఫొటోలు తీసిన అనంతరం అక్కడి చెత్తను తొలగించిన తరువాత మరోమారు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలి. దీని వల్ల అందరి పని తీరుపై నిఘా పెట్టాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
 
 అమలు బాధ్యత కమిషనర్లదే
 మున్సిపాలిటీల్లో అమలు చేసే కార్యక్రమాలు, పౌర సేవలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిన బాధ్యతను కమిషనర్లకు అప్పగించారు. ఇళ్లు, ఆస్తుల యజమానుల ఆధార్ నంబర్లు సేకరణ, వీధి లైట్లు ఎన్ని ఉన్నాయి. జనన మరణ ధ్రు వీకరణ పత్రాలు ఎన్ని జారీ చేశారు, కోర్టు కేసులు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద చేపట్టే కార్యక్రమాలు, జియోగ్రాఫిక్ మ్యాపింగ్ సిస్టమ్, అర్బన్ హౌసింగ్, పాఠశాలల అభివృద్ధికి ఎంత మేర నిధులు వచ్చాయి. ఎంత ఖర్చు చేశారు. జేఎన్‌ఎంఆర్‌యూ, స్వయం సహాయక సంఘాలకు రుణాల అందజేత, బిల్డింగ్ ప్లాన్‌ల పరిస్థితి, స్మార్ట్ వార్డు కార్యక్రమం అమలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలు  తీరుపై కమిషనర్లు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement