
సాక్షి, కృష్ణా: ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి హలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆయన తిరువూరు పట్టణంలో పలు కాలనీల్లో, మురికివాడల్లో పర్యటించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. మురుగునీటి పారుదలకై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దోమల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. పట్టణంలోని 20 వార్డుల్లో దోమల మందును పిచకారీ చేయాలని సూచించారు. విజృంభిస్తోన్న జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. పరిశుభ్ర వాతావరణం కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే రక్షణనిధి స్పష్టం చేశారు.