ఆస్తుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన హోంశాఖ | ministry of home affairs clarifies to distribution of the assets in two states | Sakshi
Sakshi News home page

‘ ఏ రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే’

Apr 19 2017 2:22 PM | Updated on Sep 5 2017 9:11 AM

ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది.

న్యూఢిల్లీ: ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపిణీపై కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 48 (1) ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని  స్థిర, చర ఆస్తుల పంపిణీ, సెక్షన్‌ 49 ప్రకారం జనాభా నిష్పత్తిలో నగదు పంచుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తాజా ఆదేశాల ప్రకారం ఏ  రాష్ట్రంలోని ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందనున్నాయి. అలాగే నగదు 52:48 నిష్పత్రిలో రెండు రాష్ట్రాలు పంపిణీ చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తే అక్కడే కొనసాగాలని పేర్కొంది. షెడ్యూల్‌ 9,10లోని అన్ని సంస్థలకు ఇవే ఆదేశాలు వర్తిస్తాయని హోంశాఖ స్పష్టం చేసింది.

కాగా ఉమ్మడి రాష్ట్రం నాటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఉద్యోగులు, ఉపకరణాలు, అప్పులను ఇరు రాష్ట్రాల సమ్మతితో జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ జరపాలని సుప్రీంకోర్టు మార్చి 18న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు పలుసార్లు సమావేశం అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల అభిప్రాయం అనంతరం ఆస్తుల పంపకాలపై తుది నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఆదేశాలు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement