నిధులు కావాలా.. మోదీనే అడగండి
ప్రజాప్రతినిధులతో లోకేశ్
అరసవల్లి (శ్రీకాకుళం): ‘ప్రజాప్రతినిధులు నిధులు మంజూరు చేయాలని అడుగుతున్నారు.. ఎక్కడి నుంచి ఇవ్వాలి? నిధులు కావాలంటే ప్రధాని మోదీనే అడగండి.. పంచాయతీరాజ్లో మార్పులకు ప్రధానే కారణం’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్కు ప్రత్యేక నిధులు ఇచ్చే అంశం పరిశీలించాలని శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి మంత్రి లోకేశ్ను కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ విషయం ప్రధాని మోదీని అడగాలని, రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.