అల్లుడి కళ్లలో కారం కొట్టి కూతురి కిడ్నాప్‌ | Love Marriage: Parents Kidnaps Own Daughter At tirupati | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకున్న జంటపై దాడి

Oct 9 2017 7:17 PM | Updated on Oct 9 2018 7:18 PM

Love Marriage: Parents Kidnaps Own Daughter At tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : వాళ్లిద్దరికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో నెలన్నర క్రితం (ఆగస్ట్‌ 16) పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో కులాలు అడ్డుగోడలుగా నిలిచాయి. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాపానికి  అల్లుడి కళ్ళల్లో కారం చల్లి కూతుర్ని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నవీన్‌ కుమార్‌ చంద్రగిరి గ్రామీణ ప్రభుత్వ  ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. మెడిసన్‌ చదువుతున్న సిరిచందనతో అతడికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ వివాహానికి దారి తీసింది. అయితే కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సిరిచందన తల్లిదండ్రులు ఇవాళ మధ్యాహ్నం రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చి... భార్యాభర్తలు ఇంటికి వెళుతుండగా నవీన్‌పై దాడి చేశారు. అనంతరం సిరిచందనను బలవంతంగా తీసుకు వెళ్లారు. నవీన్‌కుమార్‌ తన సోదరి సాయంతో చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశాడు.

కులాలు వేరు కావడంతో సిరిచందన తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతి...తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  ఈ సందర్భంగా నవీన్‌ మాట్లాడుతూ... తమ పెళ్లి సిరిచందన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అందుకే తనపై దాడి చేసి భార్యను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపాడు. గతంలో కూడా పలుమార్లు దాడులకు ప్రయత్నిస్తుంటే తిరుపతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు అతడు తెలిపాడు.

బాదితుడి ఆవేదన వీడియో

Advertisement
 
Advertisement
Advertisement