రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల
కోటగుమ్మం (రాజమండ్రి) :రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. శుక్రవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు. చికిత్స అందిస్తున్న వైద్యులను క్షతగాత్రుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాన్లలో ఎక్కువ మందిని ఎక్కించుకుని వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్పోర్టు అధికారులతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, టీడీపీ నాయకులు కాశి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పరామర్శ
రాజానగరం : జీఎస్ఎల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.