సుబ్బారాయుడికి పుత్రవియోగం

Kothapalli Subbarayudu Son Died In Narasapuram West Godavari - Sakshi

సాక్షి, నరసాపురం (పశ్చిమ గోదావరి): మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు నారాయణరాయుడు (35) మృతి చెందారు. చంటిబాబుగా ముద్దుగా పిలుచుకునే నారాయణనాయుడు చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదుగుదల లేకపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చంటిబాబు భౌతికకాయాన్ని రుస్తుంబాదలోని కొత్తపల్లి నివాసానికి తరలించారు. కుమారుడి భౌతికకాయం వద్ద సుబ్బారాయుడు దంపతులు బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కుమారుడు చంటిబాబుపై సుబ్బారాయుడుకు అమితమైన ప్రేమ అని చెప్పుకుంటారు.

సుబ్బారాయుడు సతీమణి 35 ఏళ్లుగా చంటిబాబు సంరక్షణ కోసం పూర్తి సమయాన్ని కేటాయించి శ్రమించారు. ఈ నేపథ్యంలో చంటిబాబు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  విషయం తెలియడంతో కొత్తపల్లిని ఓదార్చడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం రుస్తుంబాద చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్‌ ఎండీ షరీఫ్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్, వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు తదితర ప్రముఖలు చంటిబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top