Sakshi News home page

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే

Published Thu, Nov 20 2014 12:43 AM

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఇక జైలే

షీ టీంకు దొరికిన ఖదీర్‌కు రెండు రోజుల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన నిందితులను పీటీ కేసు కింద నమోదు చేయడంతో పోలీసు స్టేషన్‌లోనే బెయిల్‌పై విడుదలయ్యేవారు. ఇక నుంచి అలా కాకుండా ఏకంగా జైలు శిక్షే పడేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి రోజే నాంపల్లి కోర్టు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఓ నిందితుడికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించింది. మంగళవారం మల క్‌పేట బస్‌స్టాప్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతూ పతేషానగర్‌కు చెందిన ఎండీ అబ్దుల్ ఖదీర్ ఖురేషీ(37) సీసీఎస్ పోలీసు(షీటీమ్)లకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

అతనిపై సిటీ పోలీసు యాక్ట్ 70 సీ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నాంపల్లిలోని ఏడవ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ కేసు వివరాలను పరిశీలించి ఖదీర్‌కు ఎనిమిది రోజుల జైలు శిక్ష విధించా రు. తనపై ఆధారపడిన భార్య, కూతురు ఇబ్బందులకు గురవుతారని ఖదీర్ మెజిస్ట్రేట్‌ను అభ్యర్ధించి, సారీ చెప్పాడు. దీంతో శిక్షను రెండు రోజులుగా మార్చి తీర్పునిచ్చారు. ఖదీర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
 
మహిళ భద్రతపై దృష్టి....
ఇప్పటివరకు నిందితులు స్టేషన్ స్థాయిలోనే చలానా చెల్లించడంతో కేసు మూసివేసేవారు. దీంతో ఈవ్‌టీజర్లలో మార్పు రాదని తలంచిన నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి నిందితులను కోర్టులో హాజరుపర్చేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి రజనికి ఇటీవల లేఖ రాసారు. దీన్ని పరిశీలించిన జడ్జి.. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని కోర్టులో హాజరుపర్చి జైలు శిక్ష కూడా విధించాలంటూ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లను ఆదేశించారు. ఇది బుధవారం నుంచే మొదలైంది. ఇక నుంచి పట్టుబడితే ఎనిమిది రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement
Advertisement