తండ్రిని మించిన తనయుడు జగన్‌ | Kadapa MP YS Avinash Reddy Said That During The Rule CM YS Jagan Mohan Reddy Will Be A Great Leader | Sakshi
Sakshi News home page

తండ్రిని మించిన తనయుడు జగన్‌

Aug 19 2019 8:40 AM | Updated on Aug 19 2019 8:40 AM

Kadapa MP YS Avinash Reddy Said That During The Rule CM YS Jagan Mohan Reddy Will Be A Great Leader - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి 

సాక్షి, ప్రొద్దుటూరు : పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి మించిన తనయుడు అవుతాడని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. పెన్నానది తీరాన ఉన్న రెడ్ల కల్యాణ మండపంలో పట్టణ రెడ్డి సేవా సంఘం, రెడ్ల వనభోజన సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మూలె సుధీర్‌రెడ్డిలను సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కేవలం 11వేల క్యూసెక్కులు మాత్రమే వస్తుండటంతో జిల్లాలోని గండికోట, బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టులకు నీరు నింపాలంటే కష్టంగా ఉండేదన్నారు.   వైఎస్‌ఆర్‌ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 11వేల నుంచి 44వేల క్యూసెక్కులకు విస్తరించారని..  ఈ కారణంగా ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో వర్షాలు పడుతుండటంతో ఇదే సమయంలోనే రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరు విడుదల చేస్తున్నారన్నారు.

వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబు లెన్స్‌ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. కేవలం ఇచ్చిన మాటపై నిలబడినందుకుగాను వైఎస్‌ జగన్‌ ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. వైఎస్‌ఆర్‌ మరణించిన సందర్భంలో ఓదార్పు యాత్ర చేస్తానని వైఎస్‌ జగన్‌  ప్రకటించినందుకు సోనియ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా  పోరాటం చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆదరించి అధికారంలోకి తెచ్చారన్నారు.   కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి, ప్రొద్దుటూరు రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నాగదస్తగిరిరెడ్డి, కార్యదర్శి కుడుముల ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వైవీ రామమునిరెడ్డి, రెడ్ల వనభోజన సమితి అధ్యక్షుడు ఆవుల లక్ష్మినారాయణరెడ్డి పాల్గొన్నారు.

బాబు హయంలో సీమకు అన్యాయం..
చంద్రబాబు హయాంలో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. అందువల్లే ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పారన్నారు. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాల్లో 49 సీట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయని తెలిపారు. వైఎస్సార్‌ జిల్లా, కర్నూలు జిల్లాలో పార్టీ అన్ని సీట్లు గెలుచుకోగా చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆయన స్థానం మినహా 13 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా అనంతపురంలో రెండు స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయన్నారు.  రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులను నిర్మించాలని డిమాండ్‌ చేసినా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.  

నమ్మకాన్ని కాపాడుకుంటా..
మాటకు కట్టుబడి తనకు చెప్పిన ప్రకారం టికెట్‌ ఇచ్చారని జమ్మలమడుగు ఎమ్మె ల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి తెలిపారు. ఇద్దరు టీడీపీ కీలక నేతలు ఏకమైనా ఓడించి 51వేల మెజారిటీతో ప్రజలు తనను గెలిపించారన్నారు.  ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకుంటానని చెప్పారు. రెడ్ల కల్యాణ మండపం నిర్వహణకు సంబంధించి సీఎం రమేశ్‌ ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ప్రజల ఓట్లతో లీడర్‌ను అయ్యానని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు. 

రైతులను ఆదుకునేందుకు సిద్ధం..
రెడ్ల చరిత్ర ఎంతో గొప్పదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తాను రైతు బిడ్డగా, రెడ్డి బిడ్డగా ఈ సభకు హాజరయ్యానన్నారు. రెడ్డి సామాజి క వర్గానికి చెందిన  బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వేమారెడ్డి.. ఇలా ఎంతో మంది ఆదర్శనీయులున్నారన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ఆదుకునేందుకు రెడ్డి సేవా సంఘం తరపున విరాళాలు సేకరించి వడ్డీలేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇందుకు తాను ముందు వరుసలో ఉంటానని చెప్పారు. రెడ్ల కల్యాణ మండపానికి నాయుడులు కొన్ని ఇబ్బందులు కలుగజేయగా పరిష్కరిస్తామని అప్ప టి మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారన్నారు. తర్వాత ఆ హామీ నెరవేర్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కల్యాణ మండపం నిర్వహణకు ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి అనుమతులు తెస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement