
పరిశీలనకు వస్తే అవమానించారు
పాతగుంటూరు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చంద్రమౌళి అత్తిలి మంగళవారం స్థానిక...
పాతగుంటూరు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చంద్రమౌళి అత్తిలి మంగళవారం స్థానిక మహిళా శిశు సంక్షేమ కార్యాలయ పరిశీలనకు వచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయని అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యాలయమే ఇలా ఉంటే అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉంటాయో అని ఆయన వాఖ్యానించారు. ఆయన తీరును గమనించిన సిబ్బంది నకిలీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే అనుమానంతో నగరంపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అనంతరం ఆయనను మహిళా ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఇంతలో నగరంపాలెం సీఐ శ్రీనివాసరావు రంగంలోకి దిగి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ డెరైక్టర్ దినేష్ పాల్కు ఫోన్ చేసి వాకబు చేశారు.
ఆయన అసలైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబరేనని దినేష్పాల్ సీఐకు వివరించారు. తనను అవమానించారని చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. స్పష్టంగా తెలుసుకున్న తరువాత మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని వాపోయారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.