బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం | If the resignation of Babu loans cellistam | Sakshi
Sakshi News home page

బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం

Aug 11 2014 4:43 AM | Updated on Aug 14 2018 5:54 PM

బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం - Sakshi

బాబు రాజీనామా చేస్తే రుణాలు చెల్లిస్తాం

ఎన్నికలకు ముందు మహిళల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుం టాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రగిరి సభలో చంద్రబాబు గుప్పించిన హామీలపై పొదుపు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు.

  •      నమ్మించి మోసం చేసిన సీఎం
  •      నాగయ్యగారిపల్లె మహిళల ఆవేదన
  • చంద్రగిరి: ఎన్నికలకు ముందు మహిళల కష్టాలు తీర్చే బాధ్యత తీసుకుం టాను, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రగిరి సభలో చంద్రబాబు గుప్పించిన హామీలపై పొదుపు సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి కేవలం లక్ష రూపాయలు మాఫీ చేస్తానని, అది కూడా ఇప్పట్లో చెయ్యలేనని అనడంతో మహిళలు నివ్వెరపోయారు. ఇంత మోసం చేస్తాడా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలంలోని నాగయ్యగారిపల్లె దళితవాడలోని సరోజిని మహిళ సంఘం, ఇందిరా మహిళా సంఘం, నల్ల గంగమ్మ, ప్రగతి, సరస్వతి మహిళా సంఘాల సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు.

    ఒక్కొక్క మహిళకు కేవలం 10 వేల రూపాయలు రుణం మాఫీ చేస్తాననడం ఎంత వరకు న్యాయమని వారు ప్రశ్నించారు. రుణాలు తాము ఎవ్వరూ కట్టమన్నారు. చంద్రబాబునాయుడు సీఎం పదవికి రాజీనామా చేస్తే తప్ప డ్వాక్రా రుణాలు చెల్లించలేమన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే మహిళల రుణాలన్నీ మాఫీ చేయాలన్నారు. రుణాలు మాఫీ చేయకుంటే మహిళా సభ్యులు అంతా కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
     
    చేయలేనప్పుడు హామీలు ఎందుకివ్వాలి
    డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని గొప్పలు పలికి, ప్రస్తుతం మాఫీ చేయలేనప్పుడు హామీ లు ఎందుకిచ్చారు. డ్వాక్రా మహిళలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకుంటామని చంద్రగిరిలో జరిగిన సభలో చెప్పారు. ప్రస్తుతం 10 వేలు మాత్రమే మాఫీ చేస్తానంటే ఎలా? మిగిలిన రుణం ఎవరు చెల్లిస్తారు? ఇది మోసం కాదా!          
    -దాక్షాయణి, లీడర్ నల్లగంగమ్మ మహిళా సంఘం, నాగయ్యగారిపల్లె
     
    బాబుని ఇక నమ్మే ప్రసక్తే లేదు
    చంద్రబాబునాయుడును ఇక జన్మలో నమ్మే ప్రసక్తేలేదు. మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. గతంలో ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు వడ్డీల పేరుతో మోసం చేశారు. ప్రస్తుతం రుణ మాఫీల పేరుతో మోసం చేశారు. ఇక చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేదు.
     -డి.భారతి, ఇందిరా మహిళా సంఘం లీడర్, నాగయ్యగారిపల్లె
     
     నమ్మక ద్రోహం చేశారు
     ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా పక్క గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రతి ఒక్కరూ ఆయన్ను నమ్మి ఓట్లు వేశాం. ఎన్నికల ముందు గొప్పలు పలికారు. మహిళల పక్కన నిబడతానన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తరువాత మహిళలను పూర్తిగా మరిచారు. ఆడవారి ఉసురు ఆయనకు తప్పకుండా తగులుతుంది.        
     -సరస్వతి, లీడర్, సరోజిని మహిళా సంఘం, నాగయ్యగారిపల్లె
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement