
సోలార్ పార్కు హుళక్కేనా ?
సాక్షి, గుంటూరు రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో వివిధ ప్రాజెక్టులను నెలకొల్పేలా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం విఫలమవుతోంది.
సాక్షి, గుంటూరు
రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో వివిధ ప్రాజెక్టులను నెలకొల్పేలా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం విఫలమవుతోంది. అత్యంత వెనకబడిన పల్నాడు ప్రాంతంలో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినా, ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు.
= తొలి దశలో జిల్లాలో 800 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది.
= పల్నాడు ప్రాంతంలో పదివేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములన్నాయి. సోలార్ పార్కు నెలకోల్పేందుకు ఈ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపకుండా ఎక్కువ భాగం అటవీ భూములు గుర్తించి నివేదించారు.
= దీంతో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీ వెనకడుగు వేసినట్టు సమాచారం. మరోవైపు తొలుత ఆసక్తి చూపిన పారిశ్రామిక వేత్తలు కూడా ముఖం చాటేస్తున్నట్లు తెలిసింది.
= అటవీ అనుమతులు రావాలంటే ఏళ్లు పడుతుందని, ఈ నేవథ్యంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేమని పలు కంపెనీలు చేతులేత్తేశాయి. వాటికి బదులు వేరే భూములు కేటాయిస్తే అప్పుడు పరిశీలిస్తామని మెలిక పెడుతున్నట్లు సమాచారం.
= ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి అటవీ భూములు కాకుండా ప్రభుత్వ భూముల వివరాలు పంపేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు.
ఏర్పాటు ఇలా...
= ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ఐదెకరాల స్థలం కావాలి. రూ.7.5 కోట్లు ఖర్చు అవుతుంది. రోజుకు 4,000 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
= ఒక యూనిట్ను రూ.6.49 పైసల వంతున కొనుగోలు చేస్తారు. ధర్మల్ విద్యుత్ కొంత చౌక కావడంతో దీనిని కొనేందుకు పరిశ్రమల యజమానులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు.
= కేంద్ర ప్రభుత్వం సైతం ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రూ.20 లక్షల ప్రోత్సాహాన్ని ప్రకటించింది.
జిల్లాలో గుర్తించిన భూములు ఇవే...
= గురజాల మండలం దైద గ్రామంలో 207 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,193 ఎకరాల అటవీ భూమి.
= దుర్గి మండలం పోలేపల్లెలో 947 ఎకరాల ప్రభుత్వ భూమి, అడిగొప్పల గ్రామంలో 667 ఎకరాలు అటవీ భూమి.
= ఇలా మొత్తం 4,163 ఎకరాల భూమిని సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.
= నాగార్జున సాగర్ కుడికాలువ కాలువ సమీపంలో 1,720 ఎకరాల నీటిపారుదల శాఖ స్థలం ఉంది. ఇందులో కొంత భాగంలో పట్టాలు ఇచ్చారు. మెగా టూరిజం అభివృద్ధికి కొంత స్థలం పోగా మిగిలిన స్థలంలో సోలార్ విద్యుత్ కేంద్రాలు నెలకోల్పేందుకు అనువైనదిగా గుర్తించారు.