నిర్మాణ సంస్థకే ‘స్వగృహ’ ప్రాజెక్టు? | Sakshi
Sakshi News home page

నిర్మాణ సంస్థకే ‘స్వగృహ’ ప్రాజెక్టు?

Published Wed, Sep 25 2013 3:50 AM

Home project for Construction company

సాక్షి, హైదరాబాద్: ‘స్వగృహ’ ప్రాజెక్టులో ఇదో వింత. ప్రజల కోసం నిర్మించిన ఓ ప్రాజెక్టును దాన్ని నిర్మించిన బడా నిర్మాణ సంస్థకే దాసోహం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ పరిజ్ఞానంగా చెప్పుకొనే ప్రీఫ్యాబ్రికేటెడ్ విధానంతో నిర్మించిన ఆ ప్రాజెక్టును.. దాన్ని నిర్మించిన పుణెకు చెందిన సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. నిధులు లేవనే కారణంతో బకాయిల కింద దాన్ని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.  స్వగృహ కార్పొరేషన్ జవహర్‌నగర్‌లో 2,850 ఇళ్లతో ఓ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. పుణెకు చెందిన నిర్మాణ సంస్థ దీన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో నిర్మించింది.
 
  ప్రధాన నిర్మాణం పూర్తయినా.. నిధులు లేమి కారణంగా ప్రభుత్వం ఫినిషింగ్ పనులు ఆపేసింది. తొలిదఫాగా నిర్మాణ సంస్థకు కొంత డబ్బు చెల్లించినా, ఆ తర్వాత నిధులు లేక కార్పొరేషన్ బకాయి పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు పేరుకుపోయి ఉంది. ఇప్పుడు బకాయి కింద ఆ ప్రాజెక్టులోని ఇళ్లనే ఆ సంస్థకు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. అవి అసంపూర్తిగా ఉన్నందున ఒక్కో ఇంటి విలువ తక్కువగా ఉండనుంది. మూడు అంతర్జాతీయ సంస్థలు దాని విలువను లెక్కగడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.150 కోట్ల బకాయి కింద ప్రాజెక్టులో సింహభాగం ఇళ్లు ఆ సంస్థపరం కావడం ఖాయం. గతంలో ఆ ప్రాజెక్టును కొనేందుకు సీఆర్‌పీఎఫ్ సంస్థ ఆసక్తి చూపి ఆ తర్వాత వైదొలిగింది.
 
 అలాంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థలతో ఆ నిర్మాణ సంస్థకు మంచి పరిచయాలు ఉండటంతో తిరిగి సీఆర్‌పీఎఫ్ లాంటి సంస్థను ఆకట్టుకోవటం దానికి పెద్ద పనికాదు. తక్కువ ధరకు ఆ ప్రాజెక్టును సొంతం చేసుకుని దానికి మెరుగులద్ది ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉండటంతో ఆ సంస్థ కూడా బకాయి కింద ఇళ్లను తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. పైగా నగరంలోని ప్రాజెక్టు ధరల్లోంచి భూమి విలువను తగ్గించి అమ్మాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ధర తగ్గింపు లబ్ధి కూడా ఆ సంస్థకు మరింత లాభాన్ని తెచ్చిపెట్టనుందన్నమాట.
 
 జవహర్‌నగర్ ప్రాజెక్టు కాకుండా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి 20 మంది కాంట్రాక్టర్లకు కూడా కార్పొరేషన్ రూ.100 కోట్లు బకాయి పడింది. ఆ బకాయిల కింద స్వగృహ ఇళ్లను లేదా ఖాళీ స్థలాలు ఇవ్వడానికి సర్కారు అంగీకరించడంతో ఇప్పటికే ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement