బాబు పోయే.. జాబు వచ్చే.. | Grama Volunteer Interviews Completed In East Godavari | Sakshi
Sakshi News home page

బాబు పోయే.. జాబు వచ్చే..

Jul 26 2019 2:35 PM | Updated on Jul 26 2019 2:35 PM

Grama Volunteer Interviews Completed In East Godavari - Sakshi

కిర్లంపూడి మండల పరిషత్‌ కార్యాలయంలో గ్రామ వలంటీర్లకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్‌)

సాక్షి, కిర్లంపూడి (తూర్పు గోదావరి): గత టీడీపీ ప్రభుత్వం ‘‘బాబు వస్తాడు.. జాబు ఇస్తాడు’’ అంటూ ప్రచారం చేసింది.తీరా చూస్తే ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి తప్ప, కొత్త జాబ్‌లు ఒక్కటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధితో పాటు ఉద్యోగాలు కల్పిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేపట్టిన ఈ కొలువుల జాతరను చూసి యువత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ‘బాబు పోయాడు.. జాబ్‌లు వస్తున్నాయ్‌’’ అంటూ సంబరపడిపోతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా ఐదేళ్లూ కాలక్షేపం చేసింది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఉద్యోగ విప్లవాన్ని తీసుకొచ్చారు. గ్రామ వలంటీర్‌ నియామకం, పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిలో ఉద్యోగుల నియామకాలు వంటి చర్యలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకోవడంతో నిరుద్యోగ యువతలో హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే గ్రామ వలంటీర్లకు దరఖాస్తులు కోరడంతో పాటు ఇంటర్వ్యూల పర్వం కూడా ముగిసింది. వీటికి మండలం నుంచి సుమారు 1500కు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 1100 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. రేపోమాపో గ్రామ సచివాలయం పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడనుండడంతో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీటెక్, డిప్లమో పూర్తి చేసిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు.

బాబు తీరుపై విమర్శలు
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏ ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా తన కుమారుడికి దొడ్డి దారిన మంత్రి పదవి ఇచ్చుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చీరాగానే  నిరుద్యోగులకు వరాల వర్షం కురిపించారని గ్రామీణ యువతలో చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగ సమస్యపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఉద్యోగ విప్లవానికి శ్రీకారం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధి కారం చేపట్టిన అనతి కా లంలోనే రాష్ట్రంలో ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టడం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చిన రెండు నెలల్లోనే  రాష్ట్రంలో పెనుమార్పు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
– తూము కళ్యాణ్‌ (నిరుద్యోగి),కిర్లంపూడి

నిరుద్యోగ యువతలో చిగురిస్తున్న ఆశలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయాల పట్ల నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా గ్రామాల్లో వలంటీర్‌లతో పాటు, గ్రామ సచివాలయంలో ఉద్యోగ నియామక నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం. ఆ నిర్ణయం వల్ల గ్రామీణ యువతకు నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.
– కె.విష్ణు, నిరుద్యోగి, కిర్లంపూడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement