సీఎం జగన్‌కు గణపతి సచ్చిదానంద ప్రశంసలు | Ganapati Sachchidananda Welcomes Introducing English medium in govt schools In AP | Sakshi
Sakshi News home page

సీఎం జగన్ పాలన బాగుంది: గణపతి సచ్చిదానంద

Nov 23 2019 5:58 PM | Updated on Nov 23 2019 7:54 PM

Ganapati Sachchidananda Welcomes Introducing English medium in govt schools In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషి​చేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకళ్యాణం ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదవ రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ తండ్రి వైఎస్సార్‌ బాటలో జగన్‌ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కుల పునురుద్ధరిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని దీనిపై వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లీషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్రంలో ఇప్పుడు ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలంతా ఇంగ్లీషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే ఇలా విమర్శలు చేయడం తగదన్నారు. హిందూధర్మ పరిరక్షణ అన్నది ప్రతీ ఒక్కరి బాధ్యతని, దత్తపీఠం ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చేపట్టిన  అతిరుద్ర యాగానికి పలువురు భక్తులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement