స్నేహం వీడి పోలేదు | Friendship did not leave | Sakshi
Sakshi News home page

స్నేహం వీడి పోలేదు

Aug 14 2015 1:18 AM | Updated on Sep 3 2017 7:23 AM

రెండు రోజుల పాటు భారీవర్షం పడింది. పని ఉందో?లేదో? కనుక్కోవడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చేపలు పట్టడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ఉపాధిహామీ గోతిలోజారి పడి మునిగి ప్రాణాలు వదిలాడు.

రెండు రోజుల పాటు భారీవర్షం పడింది. పని ఉందో?లేదో? కనుక్కోవడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చేపలు పట్టడానికి చెరువులో దిగిన ఓ యువకుడు ఉపాధిహామీ గోతిలోజారి పడి మునిగి ప్రాణాలు వదిలాడు.  స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో చేయి అందించి మరో యువకుడు కూడా తనువు చాలించాడు. ఈ ప్రమాదంలో స్థానిక చింతలదిమ్మకు చెందిన దాసరి గాలితాత(28)రొంగలి అప్పారావు(27)మృతి చెందారు. కుటుంబాలకు పెద్దదిక్కు అయిన వారిద్దరూ మృతి చెందడంతో వారి మీద ఆధారపడి బతుకులీడుస్తున్న కుటుంబసభ్యులు కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్నారు.
 
 కొత్తవలస: కొత్తవలస మేజరుపంచాయతీ శివారు చింతలదిమ్మకు చెందిన దాసరి గాలితాత(28) రొంగలి అప్పారావు(27)లు స్నేహితులు.  వారిద్దరూ తాపీమేస్త్రీలు. వీరిద్దరూ కొంతకాలంగా తమ్మన్నమెరక సమీపంలో ఉన్న విశాఖవ్యాలీలేఅవుట్‌లో తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వర్షం కురవడంతో వారు పనికివెళ్లలేదు. గురువారం పనిఉందో?లేదో? అడగడానికని వెళ్లివస్తామని ఇంటివద్దచెప్పి బుధవారం సాయంత్రం బయల్దేరారు. తిరుగుప్రయాణంలో చేపలు దొరుకుతాయోమోనని చెరువులో ఒక వ్యక్తిదిగగా దిగిన వెంటనే గోతిలోకి జారిపోవడంతో ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో మరో యువకుడు మృతిచెందాడు. చెరువులో మృతిచెందిన ఇద్దరికీ ఈత రాదని మృతుల బంధువులు తెలిపారు. మృతిచెందిన తాతకు అక్కమ్మ అనే భార్య, సత్యవతి అనే మూడు సంవత్సరాల కుమార్తె ఉన్నారు. అప్పారావుకు ఏడాది క్రితం లక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. ఇంకా పిల్లలు లేరు.
 
 చెప్పులు, సెల్‌ఫోన్ ఆధారంగా..: చెరువు వద్ద ఉన్న చెప్పులు సెల్‌ఫోన్ ఆధారంగా  మృతులను స్థానికులు గుర్తించారు. బుధవారం సాయంత్రానికి  ఇంటికి రావాల్సిన వీరిద్దరూ రాకపోవడంతో సమీప బంధువుల ఇళ్లలో కుటుంబసభ్యులు  వెతికారు. ఒకవేళ ఫస్ట్‌షో సినిమాకు వెళ్లారేమోనని రాత్రి పదిగంటల వరకు వేచి చూశారు. ఎంతకీ వారు ఇళ్లకు చేరకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. తెల్లవారిన వెంటనే చెరువుల్లోను విశాఖవ్యాలీ లేఅవుట్ సమీపంలోను వెతికి తిరిగి వస్తుండగా చెరువువద్ద చెప్పులు సెల్‌ఫోన్ కనిపించాయి.
 
 వెంటనే స్థానిక యువకులు ధైర్యంచేసి చెరువులో వెతకగా ముందుగా గాలి తాత మృతదేహం తేలియాడింది. దీంతో  యువకులు కొత్తవలస సోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన తరువాత పోలీసుల సమక్షంలో రెండవ మృతదేహం కోసం యువకులు చెరువులో గాలించగా తాత చేయి పట్టుకుని అప్పారావు మృతదేహం ఉండడాన్ని గమనించారు. దీంతో తాత ముందు ప్రమాదవశాత్తూ జారి పడిపోగా రక్షించే ప్రయత్నంలో అప్పారావు మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుల భార్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మృతదేహాలకు పోస్టుమార్టం నిర్విహ ంచేందుకు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement