విద్యుత్ కోతలతో ఇప్పటికే జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా మార్చి ప్రారంభం నుంచి మరిన్ని గంటల పాటు కోతలు పెంచేందుకు ఏపీఎన్పీడీసీఎల్ అధికారులు రంగం సిద్ధం చేశారు.
ఖమ్మం, న్యూస్లైన్ : విద్యుత్ కోతలతో ఇప్పటికే జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా మార్చి ప్రారంభం నుంచి మరిన్ని గంటల పాటు కోతలు పెంచేందుకు ఏపీఎన్పీడీసీఎల్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పల్లెల్లో పగటి పూట కరెంట్కు నోచుకోవడం లేదు. అధికారిక కోతలకు తోడుగా అనధికారిక కోతలు పెరగడం, రాత్రివేళల్లో తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపధ్యంలో కోతలు ఇంకా పెరుగుతాయనే ప్రకటనలతో మరింతగా ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకు మండల కేంద్రాల్లో 6 గంటలు, సబ్స్టేషన్ సెంటర్లలో 8 గంటలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో 4 గంటల పాటు కోత విధిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కేంద్రాలకు మాత్రం ఊరట కల్పించారు. అయితే జిల్లాకు సరఫరా చేసే విద్యుత్కు, వినియోగానికి మధ్య తేడా ఉండటంతో మరిన్ని గంటలు కోత విధించాల్సి వస్తోందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. మార్చి ప్రారంభం నుంచి జిల్లా కేంద్రంలో నాలుగు గంటలు, మన్సిపాలిటీలలో ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఏడు గంటలు కోత విధించనున్నారు. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో పరిస్థితి ఏంటని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
లోవోల్టేజీతో కాలుతున్న ట్రాన్సఫార్మర్లు, మోటార్లు...
వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పింది. రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్ సరఫరా చేయ డం.. అదీ ఒకటి, రెండు గంటలు మాత్రమే కావడంతో ఒక్క మడి కూడా పారడంలేదని రైతులు అంటున్నారు. విద్యుత్ విని యోగానికి అనుగుణంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపి నా.. వాటి నిర్మాణాల్లో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఉన్న ట్రాన్సఫార్మర్లపైనే అధిక లోడు పడటం, లోవోల్టేజీ సమస్య ఏర్పడడంతో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఇల్లెందు, గార్ల, బయ్యారం, సత్తుపల్లి ప్రాం తాల్లో విద్యుత్ మోటార్లు తరచూ కాలిపోతున్నాయి. పంటలు ఏపుగా పెరుగుతున్న తరుణంలో సక్రమంగా నీరందకుంటే అవి చేతికందకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.