వరుస తుపాన్లతో విలవిల | farmers are loses their crops due to continuous cyclones | Sakshi
Sakshi News home page

వరుస తుపాన్లతో విలవిల

Nov 28 2013 12:40 AM | Updated on Mar 19 2019 9:20 PM

అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అతలాకుతలమైన రైతన్నను తాజాగా ‘లెహర్’ తుపాను భయపెడుతోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అతలాకుతలమైన రైతన్నను తాజాగా ‘లెహర్’ తుపాను భయపెడుతోంది. లెహర్ ప్రభావం జిల్లాపై కూడా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు రైతాంగాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. కొన్నేళ్లుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తూర్పు ప్రాంతం మినహా మిగతా చోట్ల చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో చిరుజల్లులు కురిసినా దిగువ ప్రాంతాలు జల మయం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో పైలిన్, హెలెన్ తుపాన్లు సృష్టించిన విధ్వంసానికి జిల్లావ్యాప్తంగా 66వేల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్క జొన్న, వరి, ఆముదం, పత్తి, టమాటా, క్యారెట్ తదితర ఉద్యాన తోటలు వర్షార్పణం కాగా, రెండు రోజుల క్రితం కురిసిన వానలకు చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. పైరు నేల
 వాలడంతో పొలాల్లోనే వరి మొలకెత్తే పరిస్థితి దాప్చురించింది.
 
 చినుకు పడిందా.. గోవిందా!
 జిల్లాలో సాగు చేసిన పంటల్లో సగానికి పైగా తుపాన్లకు తుడిచిపెట్టుకుపోయాయి. పైలిన్, హెలెన్ సృష్టించిన బీభత్సం మరువకముందే లెహర్ తరుముకొస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
 కోత దశకు చేరిన వరిని కోసేందుకు కూలీలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. మరోవైపు రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి పొలాల్లో నీరు చేరడ మేగాకుండా...పైరు కూడా నేలకొరిగింది. దీంతో చేను కోసేందుకు వీలు లేకుండా పోయింది.
 ఈ తరుణంలోనే తాజాగా మరో తుపాను విరుచుకుపడనుందనే వార్తలు కర్షకలోకంలో కల్లోలం సృష్టిస్తున్నాయి. కోస్తా జిల్లాలపైనే పెను తుపాను ప్రభావం ఉన్నప్పటికీ, తెలంగాణ జిల్లాలపై కాస్తో కూస్తో చూపే వీలుందనే సమాచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
 
 నష్టం ఎక్కువైతే.. పరిహారం కష్టమే!
 పంట నష్టం వివరాల సేకరణపై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మునుపెన్నడూ లేని విధంగా నష్టం ప్రతిపాదనలు పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘కోస్తా జిల్లాలకు దీటుగా రంగారెడ్డి జిల్లాలో పంటలు దెబ్బతినడమేమిటీ.. నష్టం అంచనాలను ఎక్కువగా పంపకండి’ అని ఇటీవల తనను కలిసిన జిల్లా ఉన్నతాధికారితో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో నష్టం తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నాల్లో జిల్లా అధికారులు తలమునకలయ్యారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎక్కువ పంటనష్టం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం 50శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో నష్టం ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఐదు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతుల నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు అడ్డొస్తున్నాయి.
 
 దీంతో అరకొర సమాచారంతోనే నష్టం నివేదికలు తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో కురిసిన వర్షాలతో దెబ్బతిన్న పంటలకు రూ.23.40 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంట్లో గత నెల చివరి వారంలో పడ్డ ముసురుకు 22,931 హెక్టార్ల పంటలు ధ్వంసమయ్యాయని, దీనికిగాను రైతాంగానికి రూ.21.14 కోట్ల పరిహారం ఇవ్వాలని నివేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement