పాము కాటుకు మండల పరిధిలోని చౌకాన్పల్లికి చెందిన రైతు మచ్కూరీ జ్ఞానోభా (47) బుధవారం మృతి చెందాడు.
కంగ్టి, న్యూస్లైన్ : పాము కాటుకు మండల పరిధిలోని చౌకాన్పల్లికి చెందిన రైతు మచ్కూరీ జ్ఞానోభా (47) బుధవారం మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చౌకాన్పల్లికి చెందిన మచ్కూరీ జ్ఞానోభా బుధవారం ఉదయం పశువులకు మేత తెచ్చేందుకు సిద్ధమయ్యాడు. గడ్డి కోసేందుకు అవసరైన కొడవలి, తాడు కోసం ఇంట్లోని ఓ గదిలో చేయి పెట్టాడు.
అందులో ఉన్న పాము జ్ఞానోభా చేతికి కాటు వేసింది. దీంతో విషయాన్ని ఇంట్లో చెప్పగా అక్కడే ఉన్న సోదరుడు భార్య అతన్ని కంగ్టి ఆస్పత్రికి తరలించింది. కంగ్టిలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో కర్ణాటకలోని ఔరాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య దొండుబాయి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జ్ఞానోభా సోదరుడు వైజ్యనాథ్ ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కమలాకర్ మృతదేహాన్ని పంచనామా జరిపి ఔరాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. అనంతరం చౌకన్పల్లిలో జ్ఞానోభాకు అంత్యక్రియలు చేశారు. భార్య, పిల్లలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికులు గూట్లో ఉన్న నాగు పామును బయటకు తీసి చంపేశారు.