పోలీస్శాఖలో బదిలీల జాతరకు తెర లేచింది. జిల్లాలో ఒకేసారి 48 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. ఎస్పీగా పీవీఎస్ రామకృష్ణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎస్ఐల బదిలీలపై కసరత్తు జరుగుతోంది.
నెల్లూరు(నవాబుపేట), న్యూస్లైన్: పోలీస్శాఖలో బదిలీల జాతరకు తెర లేచింది. జిల్లాలో ఒకేసారి 48 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. ఎస్పీగా పీవీఎస్ రామకృష్ణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎస్ఐల బదిలీలపై కసరత్తు జరుగుతోంది. అయితే ఎన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత మందిని బదిలీ చేసి రికార్డు సృష్టించారు. 48 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీల్లో రాజకీయ, పైరవీల మార్క్ స్పష్టంగా కన్పించింది.
కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న 35 మంది ఎస్ఐలకు పోస్టింగులు ఇవ్వడంతో పాటు రెండేళ్ల పాటు ఒకేచోట పని చేసిన వారిని బదిలీ చేశారు. పనితీరు బాగున్నా ప్రాధాన్యం కల్పించలేదని పలువురు ఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్లు పొందిన ఎస్సైలకు రానున్న ఎన్నికలు పెద్దసవాల్ కానున్నాయి. గూడూరు ఒకటో పట్టణ, నె ల్లూరు రూరల్, నెల్లూరు ఐదో నగరం, సీసీఎస్, నాల్గో నగరం, ఒకటో నగరం, మహిళా, సౌత్ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్సైలను రేంజ్, జిల్లా వీఆర్లకు బదిలీ చేశారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో మరోమారు బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్నా దృష్ట్యా తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలిసింది.