ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు ఇన్చార్జి డీలర్లుగా డ్వాక్రా మహిళలను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు
విజయనగరం కంటోన్మెంట్: ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు ఇన్చార్జి డీలర్లుగా డ్వాక్రా మహిళలను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ ఎస్. శ్రీనివాసమూర్మి తెలిపారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ వేయింగ్ మిషన్ల ద్వారానే సరుకులు ఇవ్వాలని, అలా ఇవ్వనివారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయా ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేస్తామన్నారు. జిల్లాలోని కొత్తవలస, వేపాడ, ఎస్ కోట ప్రాంతాల్లో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముందన్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఏపీఐఐసీ ద్వారానే భూములను కేటాయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్టీల్ ఎక్స్ఛేంజి ఇండియా లిమిటెడ్, శారదా స్టీల్స్ వంటి యాజమాన్యాలు కొత్తవలసలో భూములు కలిగి ఉన్నాయనీ, వారికి శాఖా పరం గా అవసరమైన సేవలందిస్తామని తెలిపారు. అలాగే వేపాడ మండలం కొండగంగుబూడి, కొత్తవలస మండలం చినరావుపల్లి, పెదరావుపల్లి, కంటకాపల్లి, చీపురువలస, ఎస్కోట మండలం చిన్న ముషిడిపల్లి, తదితర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారన్నారు.