‘భూమిపై అన్నిరకాల హక్కులు రైతులకే’

Discussion On Tenant Farmer Right Act In AP Assembly - Sakshi

అసెంబ్లీ పంటసాగుదారుల రక్షణ చట్టంపై  చర్చ

కౌలు రైతుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌

ప్రభుత్వ సాయం నిజమైన రైతుకు అందేలా చట్టం ఉంది : ధర్మాన

యజమానికి, కౌలురైతులిద్దరికీ మేలు : సామినేని

సాక్షి, అమరావతి : భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని చెప్పారు. కౌలు రైతుల రక్షణ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో గురువారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును ప్రవేశపట్టిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ... భూ యనమానుల హక్కులకు నష్టం కలగకుండా కౌలు రైతులకు రక్షణ కల్పించేలా చట్టం రుపొందించామని తెలిపారు. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందన్నారు.

గతంలోని కౌలుదారి చట్టం వలన భూ యజమానులకు అభద్రతాభావం ఏర్పడిందని, అందుకే కౌలు రైతులను యజమానులు నమ్మలేదన్నారు. తాము తెచ్చిన నూతన చట్టం వలన ఇద్దరికి మేలు చేస్తుందన్నారు. భూ రికార్టుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదన్నారు. పంటరుణం తప్ప మిగిన రుణాలన్ని భూ యజమాని తీసుకోవచ్చని తెలిపారు. రైతు భరోసా, పంట రుణాలు సాగుదారులకే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమై చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుతుంది : ధర్మాన
పంటసాగుదారుల రక్షణ చట్టం తేవడం మంచి పరిణామమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. ఈ చట్టంతో కౌలు రైతులకు మంచి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఈ చట్టం ద్వారా అన్ని సబ్సిడీలు కౌలు రైతుకు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం అందజేసే సహాయం నిజమైన రైతులకు అందేలా చట్టం తీసుకొచ్చారని ప్రశంసించారు. సమాజంలో కలిసిపోయిన నాయకుడే ఇలాంటి చట్టాలు తీసుకురాగలరని అన్నారు. పీవోటీ యాక్ట్‌ పరిధిలోని భూములను సాగుచేస్తున్న రైతులు కూడా లాభపడేలా ఈ చట్టంలో సవరణ తీసుకురావాలని కోరారు. 

రైతులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్‌ : సామినేని
పంటసాగుదారుల రక్షణ చట్టంతో యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను అన్నారు. కౌలు రైతులకు కార్డులే కాకుండా హక్కులు కూడా కల్పించడం శుభపరిణామమన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని కౌలు రైతులకు అందేలా చట్టబద్ధత కల్పించామన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తూ సీఎం జగన్‌ రైతుకు అండగా నిలిచారని ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top