ధర్మాడి సత్యంకు డీఐజీ ప్రశంసలు 

DIG Praises Dharmadi Sathyam For Being Taken Out Boat In Godavari - Sakshi

సాక్షి, కాకినాడ లీగల్‌: గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును సవాలుగా తీసుకొని వెలికి తీసి ధర్మాడి సత్యం బృందం రాష్ట్రానికి, జిల్లాకు, ప్రభుత్వానికి కీర్తి తెచ్చిందని ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ఖాన్‌ అన్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం డీఐజీ ఏఎస్‌ ఖాన్, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ అభినందించి, సత్కరించారు. డీఐజీ మాట్లాడుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుడులు తిరుగుతున్నాయి. ఇక్కడ బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారని కొనియాడారు. తమవారి మృతదేహాలను కడసారిగా చూడలేమని బంధువులు భావిస్తున్న తరుణం లో బోటును వెలికితీసి మృతదేహాలను అప్పగించారన్నారు. ధర్మాడి చేసిన కృషి మరువలేమని డీఐజీ ఖాన్‌ పేర్కొన్నారు.

ఆ గిరిజనులనూ అభినందిస్తాం
రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదం జరిగిన వెంటనే కచ్చులూరు గ్రామస్తులు వెంటనే స్పందించి 26 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడారని రేంజి డీఐజీ ఖ>న్‌ అన్నారు. తాము కచ్చులూరు గ్రామం వెళ్లి వారిని ప్రత్యేకంగా అభినందిస్తామన్నారు. ధర్మాడి  సత్యం బృందానికి రూ. 50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. బోటు వెలికి తీసిన సమయంలో శవాలను బయటకు తీసిన ఐదుగురు తోటీలకు ప్రత్యేకంగా రూ. 10 వేలు ధర్మాడి సత్యానికి ఇచ్చి  వాటిని ఆ తోటీలకు అందజేయాలని కోరారు. అడిషినల్‌ ఎస్పీ ఎస్వీ శ్రీధర్‌రావు, ఓఎస్డీ ఆరిఫ్‌ హఫీజ్, ఏఆర్‌ అడిíÙనల్‌ ఎస్పీ వీఎస్‌ ప్రభాకర్‌రావు, ఎస్పీ డీఎస్పీలు ఎస్‌.మురళీమోహన్, ఎం.అంబికా ప్రసాద్, కాకినాడ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ కరణం కుమార్, కాకినాడ క్రైం డీఎస్పీ వి.భీమరావు, ఏఆర్‌ డీఎస్పీ ఎస్‌.వెంకట అప్పారావు, ఎస్పీ సీఐ ఎస్‌.రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.బలరామమూర్తి, అధ్యక్షుడు పి.సత్యమూర్తి , సంఘ ప్రతినిధులు, సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top