జీఎం కార్యాలయం ఎదుట ధర్నా | dharna in front of the GM office | Sakshi
Sakshi News home page

జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

Jan 26 2014 3:21 AM | Updated on Sep 2 2017 3:00 AM

రూ.20లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ సాధనలో భాగంగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

 శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ :  రూ.20లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ సాధనలో భాగంగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ ఉపాధ్యక్షుడు బంటు సారయ్య మాట్లాడుతూ గని ప్రమాదాల్లో మృతిచెందిన కార్మికులకు రూ.20లక్షలు, విధుల్లో ఉండి ఏ కారణంతోనైనా సహజ మరణం చెందితే రూ.15లక్షల గ్రాంటు చెల్లించాలని డిమాండ్ చేశారు.

 కోలిండియాలో ఎక్స్‌గ్రేషియా సాధించాల్సిన బాధ్యత జాతీయ సంఘాలపై ఉందని, అక్కడ పోరాడకుండా సింగరేణిలో లేని ఎక్స్‌గ్రేషియాను ఇప్పించాలని తమపై ఒత్తిడి తేవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ఆయా సంఘాలు తమ వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఏజీఎం మహమ్మద్ అబ్బాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో  యూనియన్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతిరాజు, కె.సురేందర్ రెడ్డి, నాయకులు శేషగిరిరావు, చిలువేరు సదానందం, బుస్స రమేశ్, ముస్కె సమ్మయ్య, ఫిట్ సెక్రెటరీలు రాళ్లబండి రాజన్న, తిరుపతిరావు, కంది సమ్మిరెడ్డి, కొలిపాక సమ్మయ్య, రవీందర్‌రెడ్డి, నీలం సదయ్య, తాటి బాపు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement