
అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం
పట్టణంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని
పీఎన్ కాలనీ (శ్రీకాకుళం): పట్టణంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన కమిటీ నాయకులు టి.తిరుపతిరావు అన్నారు. స్థానిక ఎన్జీఓ హోం కూడలి నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారనితెలిపారు. ఆ ఎన్నికల హామీని 20 నెలలు గడుస్తున్నా అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమాధిపతుల కోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంక్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి పేదవాడి ఇంటి కోసం రెండు సెంట్ల స్థలం కేటాయించకపోవడం బాధాకరమన్నారు.
శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో వేలాది మంది ఇప్పటికీ సొంత ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన సిద్ధిపేట, కంపోస్టు యార్డుల్లో నిజమైన, అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన భూపోరాటాల మాదిరిగానే మళ్లీ భూ పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్ర మేరద వీధి, గొల్కొండ రేవు, దమ్మల రెల్లివీధి, గొడగల వీధి, దమ్మలవీధిల మీదుగా సాగింది.
కార్యక్రమంలో ఎం.ప్రభాకరరావు, వై.చలపతిరావు, , సూరమ్మ, లలిత, శంకరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.