తూర్పుగోదావరిలో హెలెన్ బీభత్సం, ఆరుగురి మృతి
హెలెన్ తుఫాన్ తీరం దాటిన కాసేపటికే కోస్తా జిల్లాలను అతాలకుతలం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ఆరుగురు మరణించారు. అమలాపురం రూరల్ వన్నెచింతలపూడిలో ఒకరు, ఉప్పలగుప్తం మండలం వాడపర్రులో ఒకరు, కాట్రేనికోన మండలంలో ఇద్దరు, ఐ.పోలవరం మండలం కొత్త మురముళ్లలో ఒకరు, కొత్తపేట మండలం గంటి చినపేటలో ఒకరు చొప్పున మరణించారు. గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు వంద కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. చెట్ల, గుడిసెలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలకు అపార నష్టం వాటిల్లింది.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ప్రాంతంలో చెట్టుకూలి ఓమహిళ మరణించింది. కోనసీమ ప్రాంతంలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలను అధికారులు ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ప్రధానంగా సఖినేటిపల్లి, రాజోలు, కాట్రేనికోన, ఐ.పోలవరం, అమలాపురం రూరల్, అల్లవరం, మలికిపురం, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు తుఫాను గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. గురువారం రాత్రి నుంచే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ తుఫాను గతంలో వచ్చిన 1996 నవంబర్ 6 నాటి తుఫాను అంత తీవ్రంగా లేకపోయినా.. అధికారుల వైఫల్యం కారణంగా నష్టాలు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ ప్రాంతంలో 32 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో 20 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 12 మంది మాత్రం ఓఎన్జీసీ నౌక సాయంతో తీరానికి చేరుకోగలిగారు.
హెలెన్ తుపాను హెల్ప్లైను నంబర్లు
కాకినాడ: 0884 - 2365506
ఏలూరు: 08812 - 230050
నరసాపురం: 08814 - 27699
కొవ్వూరు: 08813 - 231488
జంగారెడ్డిగూడెం: 08812 - 223660
మచిలీపట్నం: 08672 - 252572, 1077
విజయవాడ: 0866 - 2576217
విశాఖ: 1800 - 42500002
శ్రీకాకుళం: 08942 - 240557, 9652838191
నెల్లూరు: 0861- 2331477, 2331261