దిశ మార్చుకున్న బుల్‌బుల్‌ తుపాన్‌ 

Cyclone Bulbul Threat Was Missed To The State - Sakshi

రాష్ట్రానికి తప్పిన ముప్పు.. నేడు బలహీనపడే అవకాశం

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. పశ్చిమ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగతున్న బుల్‌బుల్‌ తీవ్ర తుపాను శుక్రవారం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కి.మీ, బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తరదిశగా పయనిస్తున్న ఈ తీవ్ర తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. అయితే శనివారం ఉదయం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ క్రమంగా బలహీన పడనుంది.

ఇది శనివారం అర్ధరాత్రి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ శనివారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top