మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేయాలి

Compensation Should Be Provided To The Families Of The Deceased - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రులంటే  ప్రజలు భయపడుతున్నారు

వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

కొత్తూరు :  రిమ్స్‌ ఆస్పత్రిలో రోగులకు వేసిన ఇంజెక్షన్‌ వికటించి మృతి చెందిన ముగ్గురువి ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరులో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పేదలకు కార్పోరేట్‌ వైద్యం అందుబాటులో అందించేందుకు దివంగత నేత  డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జిల్లా కేంద్రంలో  రిమ్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే దివంగత నేత ఏ లక్ష్యంతో రిమ్స్‌ ఏర్పాటు చేశారో ఆందుకు భిన్నంగా నేటి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు.  వైద్యాన్ని ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మార్చిందని రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. 

ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కరువు

మందుల కంపెనీలతో పాలక పక్షం నేతలు కుమ్ముక్కైనందున వలనే  కల్తీ మందులు, నాసిరకం మందులు ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్నాయన్నారు. రిమ్స్‌లో సరైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించడం లేదని చెప్పారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక పోవడం వలనే ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. 

నాణ్యతలేని మందులు సరఫరా వలనే ప్రాణాలు పోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలు అంటే ప్రజల్లో భయపడే విధంగా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. ఇంజెక్షన్‌ వికంటించి మృతి చెందిన వారిలో పాతపట్నం నియోజవర్గం పరిధి కొత్తూరు మండలం కాశీపురానికి చెందిన ఇస్సై శైలు మృతి చెందినట్టు చెప్పారు. 

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.20 లక్షలు ఎక్స్‌ గ్రేషియో చెల్లించాలని రెడ్డి శాంతి డిమాండ్‌ చేశారు. అదే విధంగా అస్వస్థతకు గురైన వారికి లక్ష రూపాయలు చెల్లించాలన్నారు. కల్తీ మందులు వలనే  ముగ్గురు మృతి చెందా రన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రెడ్డి శాంతి ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. 

వైద్యాన్ని ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్‌పరం చేసి సర్కార్‌ వైద్యాన్ని పట్టించుకోకపోవడం వల్లే పేదలు ప్రాణాలు పిట్టలు రాలిపోతున్నా,  పాలకులకు పట్టడం లేదని రెడ్డి శాంతి అన్నారు. మృతి చెందిన మూడు  రోజులు గడుస్తున్నా మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మూడు రోజులుగా మృత దేహాల కోసం ఆస్పత్రి చుట్టూ కుటుంబ  సభ్యులు తిరుతున్నా అప్పగించక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top