సోమిరెడ్డి..నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమా? | Sakshi
Sakshi News home page

సోమిరెడ్డి..నిజనిర్ధారణ కమిటీకి సిద్ధమా?

Published Thu, Jul 18 2019 7:03 AM

Challenge of YCP Leaders to Ex-Minister Somireddy Chandramohan Reddy in Nellore - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): మీరు చేస్తున్న ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ వేస్తాం, అందుకు మీరు సిద్ధమాని వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. మాగుంట లేఅవుట్‌లోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రభుత్వ అటవీ భూములను కబ్జా చేశారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ  భూములను అనుచరులకు అప్పగించింది మీరు కాదాని ప్రశ్నించారు. టీడీపీ నేతల చెరలోని అటవీ భూములను ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే రాజకీయ రంగుపులమడం సిగ్గుచేటన్నారు. అవినీతి పరుల కబంధ హస్తాల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే అభినందించాల్సింది పోయి అనుచరులకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం సిగ్గుచేటన్నారు. నిడిగుంటపాళెంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణ జరిపించారన్నారు. కంటేపల్లిలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన సెల్‌టవర్‌ వ్యవహారంలో మీ పాత్ర లేదాని సోమిరెడ్డిని ప్రశ్నించారు. తమ వైపు తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, మీరు సిద్ధమాని సోమిరెడ్డికి సవాల్‌ విసిరారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు తరిమి కొట్టినా సిగ్గులేకుండా, ఏదో రకంగా వార్తల్లో ఉండాలని ఇటువంటి నీచ పనులు చేస్తున్నారని విమర్శించారు.  ఐదేళ్లలో సాగించిన దోపిడీ ఎక్కడ బయటపడుతుందోనని సోమిరెడ్డికి వెన్నులో వణుకు పుడుతుందన్నారు.   సర్వేపల్లి నియోజవర్గంలోని  బీసీ నేతలంతా సోమిరెడ్డి బాధితులేనన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో బీసీ నేతలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాయకులను ఇబ్బంది పెట్టే సంస్కృతి సోమిరెడ్డిదేనన్నారు. ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి పంచభూతాలను, గుళ్లను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ప్రజల నుంచి దోచుకున్న సోమ్మును కక్కిస్తామన్నారు. ఈ సమావేశంలో  మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటశేషయ్య, చిరంజీవులుగౌడ్, నెల్లూరు శివప్రసాద్, భాస్కర్‌గౌడ్, ఉప్పల శంకరయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement