రోజురోజుకూ పెరిగిపోతున్న చలితో రాష్ట్రం గజగజా వణుకుతోంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరిగిపోతున్న చలితో రాష్ట్రం గజగజా వణుకుతోంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆదిలాబాద్, ఖమ్మం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. బుధవారం విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఘాట్లో 2 డిగ్రీలు, లంబ సింగిలో 4, మినుములూరులో 5, చింతపల్లిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజధాని హైదరాబాద్లోనూ గత ఏడాదికంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ప్రాంతం లో గత ఏడాదితో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏకంగా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతుండడం గమనార్హం. కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో గత ఏడాది డిసెంబరు 18న నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలకంటే ఈసారి అదే తేదీన నాలుగు డిగ్రీల వరకూ తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
వరంగల్లో ఆరు డిగ్రీలు తక్కువగా నమోదైంది. డిసెంబర్ రెండో పక్షంలోనే చలి తీవ్రత జనవరిని తలపిస్తోంది. ఇక ఏజెన్సీల్లో మంచు దట్టంగా కప్పేస్తుండటంతో.. ఉదయం పది గంటలకుగానీ రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు.